డిజిటల్ సర్వీసుల్లో మార్పులు… వాట్సాప్, రైల్వే యాప్పై తాజా అప్డేట్!
మార్చి 1 నుంచి మన రోజువారీ డిజిటల్ లావాదేవీల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'సిమ్ బైండింగ్' నిబంధనను అమల్లోకి తెచ్చింది.
By: Madhu Reddy | 28 Feb 2026 11:22 PM ISTమార్చి 1 నుంచి మన రోజువారీ డిజిటల్ లావాదేవీల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 'సిమ్ బైండింగ్' నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై మీ ఫోన్లో సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్స్ పనిచేస్తాయి. మరోవైపు, రైల్వే ప్రయాణికుల కోసం పాత UTS యాప్ స్థానంలో సరికొత్త 'రైల్ వన్' యాప్ను అందుబాటులోకి తెచ్చారు. యూపీఐ లావాదేవీల్లోనూ భద్రతా పరమైన కొత్త రూల్స్ నేటి నుంచే వర్తించనున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి.
సైబర్ మోసగాళ్లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్స్ పనిచేయాలంటే ఆ సంబంధిత సిమ్ కార్డు ఖచ్చితంగా ఫోన్లోనే ఉండాలి. ఇక ఒకవేళ మీరు సిమ్ను తీసివేసినా లేదా ఆ నంబర్ ఇన్యాక్టివ్గా ఉన్నా యాప్ సేవలు ఆగిపోతాయి. అంతేకాదు, వాట్సాప్ వెబ్ను కంప్యూటర్లలో వాడే వారు ఇకపై ప్రతి 6 గంటలకు ఒకసారి మళ్ళీ లాగిన్ (QR కోడ్ స్కాన్) చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ అకౌంట్ ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా రక్షణ లభిస్తుంది.
రైల్వే ప్రయాణికులు ఇప్పటివరకు వాడుతున్న UTS యాప్ సేవలు నేటితో నిలిచిపోయాయి. దీని స్థానంలో వచ్చిన 'రైల్ వన్' సూపర్ యాప్ ద్వారానే అన్రిజర్వ్డ్, ప్లాట్ఫారమ్ మరియు సీజన్ టికెట్లను బుక్ చేసుకోవాలి. మీ పాత UTS వాలెట్లోని బ్యాలెన్స్ ఆటోమేటిక్గా ఈ కొత్త యాప్లోకి మారిపోతుంది, కాకపోతే అదే మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. ఇక డిజిటల్ టికెటింగ్ ప్రోత్సహించేందుకు ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేస్తే 3% తగ్గింపు కూడా లభిస్తోంది. ఇది ప్రయాణికులకు ఒకే యాప్లో అన్ని సదుపాయాలను అందిస్తుంది.
డిజిటల్ చెల్లింపులను మరింత సురక్షితం చేసేందుకు ఎన్పీసీఐ మార్పులు చేపట్టింది. ముఖ్యంగా రూ. 2000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లేదా కొత్త వ్యక్తికి మొదటిసారి డబ్బులు పంపేటప్పుడు అదనపు వెరిఫికేషన్ అవసరం కావచ్చు. కేవలం యూపీఐ పిన్ మాత్రమే కాకుండా, బయోమెట్రిక్ లేదా అదనపు సెక్యూరిటీ స్టెప్స్ అడిగే అవకాశం ఉంది. ఇక సైబర్ నేరగాళ్లు మన అకౌంట్ల నుంచి సులభంగా డబ్బులు కాజేయకుండా ఉండేందుకు ఈ 'రిస్క్ బేస్డ్ మానిటరింగ్' సిస్టమ్ పని చేస్తుంది. అందుకే ఇకపై ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.
