Begin typing your search above and press return to search.

‘మిస్సింగ్‌’ కథ వెనుక నిజం.. ధర్మస్థల కేసులో కొత్త మలుపు

కర్ణాటకలోని ప్రముఖ యాత్రాక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది.

By:  Tupaki Desk   |   23 Aug 2025 4:01 PM IST
‘మిస్సింగ్‌’ కథ వెనుక నిజం.. ధర్మస్థల కేసులో కొత్త మలుపు
X

కర్ణాటకలోని ప్రముఖ యాత్రాక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. గతంలో కీలక వ్యక్తి వాంగ్మూలం మార్చడంతో సంచలనం రేపిన ఈ వ్యవహారంలో తాజాగా మరో ట్విస్టు బయటపడింది. తన కుమార్తె అదృశ్యమైందంటూ ఆరోపణలు చేసిన సుజాత భట్ అనే మహిళ, ఇప్పుడు ఆ కథ అంతా కల్పితం అని ఒప్పుకున్నారు.

కుమార్తె తిరిగి రాలేదంటూ పోలీసులను ఆశ్రయించి...

“ధర్మస్థల ఘటన పెద్ద ఎత్తున చర్చకు రావడంతో, సుజాత భట్ 2003లో తన కుమార్తె అనన్య భట్ స్నేహితులతో అక్కడికి వెళ్లి తిరిగి రాలేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.” అప్పట్లో తమను పోలీసులు పట్టించుకోలేదని, బెదిరించి మౌనం పాటింపజేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఈ వ్యవహారాన్ని ధర్మస్థల కేసుతో కలిపి విచారణ ప్రారంభించారు.

వారు చెప్పినట్లే చేశా..

సుజాత మీడియా ముందు అసలు నిజాన్ని బయటపెట్టారు. ‘‘నాకు అనన్య భట్ అనే కుమార్తె లేరు. ఆ కథ మొత్తాన్ని కొంతమంది ప్రభావశీలులు చెప్పించారు. అదృశ్యమైంది అంటూ ప్రచారంలోకి వచ్చిన ఫొటోలు కూడా నకిలీవే. మా కుటుంబానికి చెందిన భూమిని ఆలయ అధికారులు బలవంతంగా తీసుకున్నందుకు, ఆ ఆస్తి వివాదం పరిష్కారం కోసం నేను వారి సూచనల మేరకు ఈ కథ చెప్పాను’’ అని స్పష్టం చేశారు. తాను డబ్బులు తీసుకోలేదని, కానీ తప్పుడు ఆరోపణలు చేసినందుకు పశ్చాత్తాపం ఉందని తెలిపారు. ప్రజలు, భక్తులు తనను క్షమించాలని వేడుకున్నారు.

అతనూ మాటమార్చాడా?

గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతంలో ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా సంచలన ఆరోపణలు చేశాడు. అతడి సూచనల మేరకు తవ్వకాలు జరపగా మృతదేహ అవశేషాలు లభించాయి. కానీ తరువాత అతడూ మాట మార్చి కొత్త వాదన చేశాడు. దీంతో మొత్తం కేసు మిస్టరీగా మారింది.