పట్టపగలు దారుణం.. గన్తో బెదిరించి మహిళను దోచేసిన దుండగుడు!
ఢిల్లీలో పట్టపగలు ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు నడిరోడ్డు మీద ఒక మహిళను గన్తో బెదిరించి దోచుకున్నాడు.
By: Tupaki Desk | 7 May 2025 9:48 AM ISTఢిల్లీలో పట్టపగలు ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ దుండగుడు నడిరోడ్డు మీద ఒక మహిళను గన్తో బెదిరించి దోచుకున్నాడు. ఈ ఘటన ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో జరిగిందని సమాచారం. అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. వీడియోలో దుండగుడు మహిళ వైపు గన్ గురి పెట్టి బెదిరిస్తూ కనిపించాడు. ఆమెను అరవద్దని కూడా హెచ్చరించాడు. ఆ తర్వాత బాధితురాలి పర్స్ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన ఒక నివాస ప్రాంతంలోని ఇరుకైన సందులో జరిగింది.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో దుండగుడు ఈజీగా తన పని పూర్తి చేసుకున్నాడు. ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందో లేదో ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన జాతీయ రాజధాని ప్రాంతంలో స్థానికుల భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి ఘటనే ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో జరిగింది. లాహోరి గేట్ ప్రాంతానికి చెందిన ఒక వ్యాపారిని నడిరోడ్డుపై సాయుధ దుండగుడు రూ.80 లక్షలు దోచుకున్నాడు. ఈ ఘటన చాందినీ చౌక్ ప్రాంతంలోని హవేలీ హైదర్ కులీలో జరిగింది.
గత ఏడాది సెప్టెంబర్లో ముగ్గురు సాయుధ దుండగులు ఈశాన్య ఢిల్లీలోని న్యూ సీలంపూర్ మార్కెట్లోని ఒక దుకాణాన్ని లక్ష్యంగా చేసుకుని, గన్తో బెదిరించి రూ. 12,000 నగదు దోచుకున్నారు. ఈ ఘటన దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల్లో భయం మాత్రం తగ్గడం లేదు.
