ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీ గోడలకు 'ఆవు పేడ' పూతలు!
చదవేస్తే ఉన్నమతి పోయినట్టుగా ఉంది.. ఢిల్లీ యూనివర్సిటీ వ్యవహారం అంటూ.. నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
By: Tupaki Desk | 14 April 2025 10:39 AMచదవేస్తే ఉన్నమతి పోయినట్టుగా ఉంది.. ఢిల్లీ యూనివర్సిటీ వ్యవహారం అంటూ.. నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇక, మేధావులు, హక్కుల సంఘాలు, కమ్యూనిస్టు నాయకులు అయితే.. దుమ్ము రేపుతున్న స్థాయిలో.. ఆర్ ఎస్ ఎస్ భావజాలం పూర్తిగా యూనివర్సిటీ కాలేజీలకు అలుముకుందని అంటున్నారు. ఇంతకీ.. ఇంత వివాదానికి కారణం.. కాలేజీలోపలి గోడలకు స్వయంగా ప్రిన్సిపాల్ ఒకరు ఆవుపేడను పూతలుగా పూయడమే!
చిత్రంగా ఉన్నప్పటికీ.. నిజం. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో.. ఢిల్లీలోనే ఉన్న ఝన్సీలక్ష్మీబాయి కాలేజీలో ఈ ఘన కార్యం జరిగింది. సాక్షాత్తూ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష వత్సల.. కాలేజీలోని తరగతి గదుల లోపలి గోడలకు రైతుల నుంచి సేకరించిన.. ఆవు పేడను ముద్దలు ముద్దలుగాతీసుకుని స్వయంగా అలికారు. దీనికిగాను ఆమె ఉపాధ్యాయులను కూడా ఆదేశించారు. కానీ, వారు రాబోమని నిరసన వ్యక్తం చేయడంతో స్వయంగా ప్రిన్సిపాలే రంగంలోకి దిగారు.
ఇదీ.. వాదన..
ఇక, ఈ వ్యవహారం.. వీడియోలుగా మారి.. సోషల్ మీడియాలో రచ్చ రేగింది. చదవేస్తే ఉన్నమతి పోయిన ట్టు కళాశాల లోపలి గోడలకు ఆవుపేడ పూతలేంటి? మహాప్రభో అంటూ.. కామెంట్లు తీవ్రమయ్యాయి. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ సుదీర్ఘవివరణ ఇచ్చారు. ప్రస్తుతం వేసవి ఠారెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా.. చల్లదనంలో చదువుకునేందుకు గాను.. ఇలా క్లాస్ రూమ్ గోడలకు ఆవుపేడ పూసినట్లు ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల వివరణ ఇచ్చారు.
అయితే.. దీనిపై విపక్షాలు మాత్రం మోడీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. గోవు.. ఇప్పుడు కాలేజీ గోడలకు సైతం ఎక్కిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. మేధావులు కూడా.. ఆవు పేడతో చల్లదనం వస్తుందని ఎక్కడాలేదని.. పైగా తడిస్తే.. దాని నుంచి వాసన వస్తుందని.. విద్యార్థులకు ఏమాత్రం అది సౌకర్యంగా కూడా ఉండబోదని పెదవి విరుస్తున్నారు.