దిల్లీ పేలుడు : పాక్ మీడియా స్పందన ఏంటంటే?
డాన్ పత్రిక ఈ వార్తను "దిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు.. ఎనిమిది మంది మృతి" అనే శీర్షికతో ప్రచురించింది.
By: A.N.Kumar | 12 Nov 2025 4:00 AM ISTనవంబర్ 10న దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ దారుణ ఘటనలో 12 మంది మరణించగా.. సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై భారత ప్రభుత్వం కఠిన విచారణకు ఆదేశించగా దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
* పాకిస్థాన్ మీడియా స్పందన
భారతదేశంలో జరిగిన ఈ పెద్ద ఘటనపై పాకిస్థాన్ మీడియా కూడా విస్తృతంగా దృష్టి సారించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి ప్రముఖ పత్రికలు, న్యూస్ ఛానెళ్లు ఈ వార్తను తమ ప్రధాన పేజీల్లో ప్రచురించాయి. అన్ని నివేదికల్లోనూ ఉగ్రవాద కోణంపైనే ప్రధానంగా దృష్టి సారించడం గమనార్హం.
* పత్రికల హెడింగ్లు.. నివేదికల సారాంశం
డాన్ పత్రిక ఈ వార్తను "దిల్లీలో ఎర్రకోట వద్ద పేలుడు.. ఎనిమిది మంది మృతి" అనే శీర్షికతో ప్రచురించింది. తరువాతి సంచికలో దిల్లీ పోలీసులు విచారణ ఉగ్రవాద నిరోధక చట్టం కింద జరుగుతోందని వెల్లడించినట్లు పేర్కొంది, అలాగే ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారని నివేదించింది. జియో న్యూస్, ది న్యూస్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా "దిల్లీ పేలుడుపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు" అనే శీర్షికతో కథనాలు ప్రచురించాయి. ఇక ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ "దిల్లీ ఎర్రకోట వద్ద అనుమానాస్పదంగా కారులో పేలుడు" అని రాసి, ఘటన తరువాత ముంబయి, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించబడిందని పేర్కొంది. పాకిస్థాన్ టుడేలో పేలుడు జరిగిన కారు యజమాని సల్మాన్ను భారత పోలీసులు అరెస్టు చేశారని, అతనికి కొన్ని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలు ఉన్నాయని తమ కథనంలో ప్రత్యేకంగా పేర్కొంది.
* భారత దర్యాప్తు ముమ్మరం
ప్రస్తుతం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక విభాగం (NIA), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), ఫోరెన్సిక్ టీమ్స్ సంయుక్తంగా దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ప్రాథమిక నివేదికల్లో ఈ పేలుడు వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రమేయం ఉన్నట్లు సూచనలు ఉన్నాయని సమాచారం. చాలా ఏళ్లుగా పెద్ద పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న భారత రాజధానిలో అందునా ఎర్రకోట వంటి చారిత్రాత్మక ప్రదేశం సమీపంలో ఈ ఘటన జరగడం భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలను లేవనెత్తింది.
భారతదేశంలో జరిగిన ఈ దారుణ ఘటనపై పాక్ మీడియా కవరేజ్, రెండు దేశాల మధ్య ఉన్న సంవేదనశీల సంబంధాలను ప్రతిబింబిస్తోంది. ప్రతి పాక్ మీడియా సంస్థ ఉగ్రవాద కోణంలోనే విశ్లేషించడంతో ఈ పేలుడు భవిష్యత్తులో మరిన్ని రాజకీయ, భద్రతాపరమైన చర్చలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
