Begin typing your search above and press return to search.

ద‌ర్శిలో పొలిటిక‌ల్ సైలెన్స్‌.. రీజ‌న్ ఏంటి... !

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు సైలెంట్ అయిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో అత్యంత ట‌ఫ్ ఫైట్ జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

By:  Garuda Media   |   18 Feb 2026 8:00 PM IST
ద‌ర్శిలో పొలిటిక‌ల్ సైలెన్స్‌.. రీజ‌న్ ఏంటి... !
X

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు సైలెంట్ అయిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో అత్యంత ట‌ఫ్ ఫైట్ జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చిన రోజు.. అర్ధ‌రా త్రి చివ‌రి నిముషం వ‌ర‌కు.. గెలుపు దోబూచులాడిన నియోజ‌క‌వ‌ర్గంగా కూడా.. ద‌ర్శి పేరు తెచ్చుకుంది. టీడీపీ త‌ర‌ఫున గొట్టిపాటి ల‌క్ష్మి, వైసీపీ త‌ర‌ఫున బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి పోటీ చేశారు. అతి క‌ష్టం మీద 2400 పైచిలుకు ఓట్ల తేడాతో బూచేప‌ల్లి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆది నుంచి దూకుడుగా ఉండే నేత‌గా పేరు తెచ్చుకున్న బూచేప‌ల్లి.. వైసీపీలో ఒక కీల‌క నేత‌గా కూడా గుర్తింపు పొందారు. కానీ, గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత కాలంలో ఆయ‌న సైలెంట్ అయిపోయారు. జ‌డ్పీటీసీగా ఆయ‌న మాతృమూర్తి వెంకాయ‌మ్మ ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌యోక‌వ‌ర్గంలో మాత్రం పెద్ద‌గా వైసీపీ కార్య‌క్ర‌మాలు సాగ‌డం లేదు. అంతేకాదు.. కేడ‌ర్‌లోనూ పెద్ద‌గా దూకుడు క‌నిపించ‌డం లేదు. దీంతో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం ఊసుఎక్క‌డా వినిపించ‌డం లేదు.

రెండు కార‌ణాలు: ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే సైలెంట్ కావ‌డానికి రెండు రీజ‌న్లు ఉన్నాయ‌ని పార్టీ లో చ‌ర్చ సాగుతోంది. 1) ఆయ‌న‌కు అసెంబ్లీకి వెళ్లాల‌ని కోరిక‌. ప్ర‌స్తుతమే కాదు.. గ‌తంలోనూ అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్య‌లు చెప్పాల‌ని.. నిధులు తెచ్చుకోవాల‌ని బూచేప‌ల్లి పార్టీలో చెబుతూ వ‌చ్చారు. కానీ, పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం.. దీనిని వ్యతిరేకిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం ఇస్తే త‌ప్ప‌.. వ‌ద్ద‌ని ఆయ‌న చెబుతున్నారు. దీనిని బూచేప‌ల్లి త‌ప్పుబ‌డుతున్నార‌ట‌.

2) నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ దూకుడు. టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన స్వ‌ల్ప మెజారిటీతో ఓడిపోయిన ప్పటికీ.. గొట్టిపాటి ల‌క్ష్మి.. ఇక్క‌డ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. తొలినాళ్ల‌లో వివాదానికి దిగిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత‌.. కాలంలో బూచేప‌ల్లి స‌ర్దుకు పోయే ధోర‌ణితోనే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. త‌ద్వారా.. ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకుంటున్నార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఈ రెండు కార‌ణాల‌తోనే ద‌ర్శిలో రాజ‌కీయ స్త‌బ్ద‌త నెల‌కొంద‌ని అంటున్నారు.