కర్ణాటకలో కుర్చీలాట - కేంద్రంపై విమర్శల వేట.. రాజీనామాకు సిద్ధమే కానీ..!
ప్రస్తుతం కర్ణాటక రాజకీయం రెండు ప్రధానాంశాల చుట్టూ తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేడిని పుట్టిస్తోంది.
By: Tupaki Political Desk | 8 March 2026 4:40 PM ISTప్రస్తుతం కర్ణాటక రాజకీయం రెండు ప్రధానాంశాల చుట్టూ తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేడిని పుట్టిస్తోంది. ఒకటి ముఖ్యమంత్రి పీఠం మార్పు గురించి వస్తున్న ఊహాగానాలు అయితే, రెండు సామాన్యుడిని వణికిస్తున్న 'సిలిండర్ మంట'. ఈ రెండింటిపై సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో స్పందించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా తన పదవిపై వస్తున్న వార్తలకు ఆయన ఒక వింతైన సమాధానం ఇస్తూనే, బంతిని అధిష్ఠానం కోర్టులోకి నెట్టేశారు.
అధిష్ఠానం చెబితే ఆ క్షణమే తప్పుకుంటా!
తన నియోజకవర్గం పిళ్లాహళ్లి హెలీప్యాడ్ వద్ద మాట్లాడిన సిద్ధరామయ్య, పదవిపై తనకున్న విధేయతను చాటుకుంటూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సిందేనంటూ సొంత పార్టీలోనే అంతర్గత చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన స్పందిస్తూ.. ‘ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని పార్టీ అధిష్ఠానం ఒక్క మాట చెబితే చాలు.. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ క్షణమే తప్పుకుంటాను’ అని ప్రకటించారు. పార్టీ పట్ల తనకున్న విధేయతను చాటుకుంటూనే, తనపై అధినాయకత్వానికి పూర్తి విశ్వాసం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు తనకే ఉందని గుర్తు చేస్తూ, అవకాశం వస్తే మరో రెండు సార్లు ప్రవేశపెట్టే సత్తా ఉందని అనడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
మోదీ సర్కారుపై 'సిలిండర్' అస్త్రం!
తన పదవి గండం గురించి వస్తున్న వార్తలకు చెక్ పెడుతూనే, ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శల యుద్ధం మొదలుపెట్టారు. దేశీయ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వ తప్పుడు విదేశాంగ విధానాలే కారణమని తీవ్రంగా ఆరోపించారు. ‘భారతదేశంలోని లక్షలాది సామాన్య కుటుంబాలపై కేంద్రం భారమైన భారాన్ని మోపుతోంది’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. ఈ గ్యాస్ ధరల పెరుగుదల కేవలం యాదృచ్ఛికం కాదని, ఇది కేంద్రం దౌత్య పరమైన లొంగుబాటుకు నిదర్శనమని విశ్లేషించారు.
వ్యూహాత్మక లోపాలు - రాజీనామా డిమాండ్!
ప్రధాని మోదీ అమెరికాతో గుడ్డిగా సమన్వయం చేసుకుంటూ, రష్యా-ఇరాన్ వంటి ఇంధన భాగస్వాములతో మన దేశానికి ఉన్న దశాబ్దాల సంబంధాలను దెబ్బతీశారని సిద్ధరామయ్య ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ.. వ్యూహాత్మక లోతుల లేకపోవడం వల్లే సామాన్యుడు గ్యాస్ మంటను భరించాల్సి వస్తోందని మండిపడ్డారు. తన రాజీనామా గురించి అడుగుతున్న వారికి బదులుగా, దౌత్య సాహసాలకు ప్రజలు ఎందుకు మూల్యం చెల్లించాలో మోదీ వివరించాలని, ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ప్రధానే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కర్ణాటకలో ఉగాది తర్వాత పెను మార్పులు సంభవిస్తాయన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో, సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు పార్టీ లోపల అసమ్మతిని ఎదుర్కొంటూనే, ఇటు కేంద్రంపై పోరాట యోధుడిలా కనిపిస్తూ తన స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నట్లు కనిపిస్తోంది. అటు పదవి కోసం సొంత పార్టీ నేతల ఒత్తిడి, ఇటు ధరల పెంపుపై ప్రజల ఆగ్రహం మధ్య సిద్ధరామయ్య గారి ఈ రాజకీయ చదరంగం ఎటు దారితీస్తుందో చూడాలి.
