పవన్ సతీమణిపై సీపీఐ రామకృష్ణ దారుణ వ్యాఖ్యలు!
కాషాయ బట్టలు కట్టుకొని.. నుదుటిన బొట్టు పెట్టుకొని పవన్ కల్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారన్న ఆయన.. పనిలో పనిగా పవన్ సతీమణి అన్నాలెజినోవా మీదా నోరు పారేసుకున్నారు.
By: Tupaki Desk | 17 April 2025 7:18 AMరాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవచ్చా? సంస్కారం అన్నది లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు.. చెబుతున్న మాటల్ని చూస్తున్న వారికి ఒళ్లు మండటమే కాదు.. ఇందుకుకదా కమ్యునిస్టు పార్టీలు కాలగర్భంలో కలిసి పోతుందన్న అభిప్రాయం ఎక్కువ అవుతోంది. ఒక మహిళకు సంబంధించి పూర్తి వ్యక్తిగత విషయానికి సంస్కారాన్ని వదిలేసి సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఆ మాత్రానికి ఇంట్లో ఉన్న మహిళను.. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని దుర్మార్గంగా చిత్రీకరించిన వైనం చూసినప్పుడు ఇదేం పోయే కాలం? అన్న ప్రశ్న మదిలో మెదలకుండా ఉండదు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి పవన్ కల్యాణ్ పూర్తిగా మారిపోయారని విమర్శించిన సీపీఐ రామకృష్ణ.. బీజేపీ ఎజెండాను మోస్తున్నట్లుగా మండిపడ్డారు.
కాషాయ బట్టలు కట్టుకొని.. నుదుటిన బొట్టు పెట్టుకొని పవన్ కల్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారన్న ఆయన.. పనిలో పనిగా పవన్ సతీమణి అన్నాలెజినోవా మీదా నోరు పారేసుకున్నారు. ‘సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా చెప్పుకునేందుకు క్రిస్టియన్ అయిన భార్యకు తిరుమలలో గుండు చేయించారు. అంత అవసరమా?’ అని వ్యాఖ్యానించారు. రామకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని విన్న వారంతా తిరిగి రామకృష్ణను ఉద్దేశించి.. ‘ఈ తరహా వ్యాఖ్యలు అవసరమా?’ అంటూ రివర్పు అవుతున్నారు.
ఒకప్పుడు సైద్ధాంతిక బలంతో మాట్లాడే కామ్రేడ్లు.. కాలక్రమంలో విలువల్ని వదిలేసి.. ప్రచారం కోసం.. ఉనికి కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నట్లుగా మండిపడుతున్నారు. పవన్ సతీమణి విషయానికి వస్తే.. తన కొడుకు ఆరోగ్యంగా ఉండటం కోసం ఆమె మొక్కుకోవటం తప్పేముంది? నిజంగానే పవన్ బలవంతంగా మీద గుండు కొట్టించుకుందని అనుకుందాం. అలా అయితే.. తిరుమలలో ఆమె వ్యవహారశైలిని చూసిన వారెవరూ కూడా ఆమె చేత ఎవరో చెప్పి బలవంతంగా తమ భావాల్ని రుద్ది చేసినట్లుగా కనిపించదు.
ఒక మనిషి మతం ఏమిటి? దాన్ని వారు ఎలా చూస్తారు? ఇతర మతాల విషయంలో వారి విశ్వాసం ఏమిటన్నది పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలు. అలాంటి వాటిని ప్రస్తావించి.. ప్రశ్నించటానికి సీపీఐ రామకృష్ణకు ఏం హక్కు ఉంది? క్రిస్టియన్ అయిన వారు ఎవరూ హిందూ ధర్మాన్ని.. హిందూ విశ్వాసాల్ని పాటించకూడదా? అలా అయితే.. రాజకీయ నేతలు ఇతర మతాల పర్వదినాల సందర్భంగా అందులో హాజరు కావటం.. వారి సంప్రదాయానికి అనుగుణంగా నడుచుకోవటం లాంటివి కూడా తప్పే అవుతాయి కదా? లౌకికవాదులమన్న ముసుగులో ఇంత సంస్కారహీనంగా వ్యాఖ్యలు చేసే రామకృష్ణ లాంటి నాయకుల కారణంగా వామపక్షం అంతకంతకూ కామెడీషోగా మారుతుందని చెప్పక తప్పదు.