'అఖండ కాంగ్రెస్'.. సాధ్యమేనా?
అఖండ కాంగ్రెస్.. ఇప్పుడు జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ స్థాయి వరకు పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట.
By: Garuda Media | 13 Jun 2026 11:00 PM ISTఅఖండ కాంగ్రెస్.. ఇప్పుడు జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ స్థాయి వరకు పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో పలు ప్రాంతీయ పార్టీలు విలీనం కావడం ద్వారా.. జాతీయ కాంగ్రె స్ పార్టీని బలోపేతం చేయనున్నారని.. వార్తలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి. తద్వారా.. ప్రస్తుత కాంగ్రె స్ పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా `అఖండ కాంగ్రెస్`గా ఆవిర్భవించాలన్నది ప్లాన్గా ఉందని అంటున్నారు.
ప్రస్తుతం వేస్తున్న అంచనాలు.. తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలను బట్టి.. పశ్చిమబెంగాల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ), మహారాష్ట్రలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. సహా.. అసోం.. మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ బాధిత పార్టీలన్నీ.. కాంగ్రెస్లో విలీనం అవుతాయని అంటున్నారు. వీటిని ఏకం చేసి.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారపై 2029లో ఉద్యమించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నది జాతీయ మీడియా విశ్లేషణ.
సాధ్యమేనా?
అఖండ కాంగ్రెస్ పార్టీపై చర్చ సాధ్యమవుతున్నా.. ఈ చర్చ నిజరూపంలో సాధ్యం కావడం అంత ఈజీ కాదు. పరస్పర భిన్న అభిప్రాయాలు.. పరస్పర రాజకీయ ప్రయోజనాలు భిన్నంగా ఉన్న నేపథ్యంలోనే గతంలో కాంగ్రెస్ పార్టీలోనే నాయకులుగా ఉన్న మమతా బెనర్జీ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీఎంసీ పెట్టుకున్నారు. ఇక, సోనియా నాయకత్వాన్నే సవాల్ చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ సైతం.. హస్తం పార్టీని వీడి.. 2000 సంవత్సరంలోనే.. ఎన్సీపీ పేరుతో పార్టీ పెట్టారు.
ఇవే కాదు.. అనేక పార్టీలు కూడా కాంగ్రెస్ నుంచి పుట్టినవే. ఇప్పుడు కేవలం బీజేపీ-ప్రధాన మంత్రి నరేం ద్ర బూచికారణాన్ని చూపుతూ.. కాంగ్రెస్తో కలిసిపోవాలని.. అనుకుంటున్నా.. దీనిని తాత్కాలిక చర్యగా నే పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ విలీన ప్రతిపాదనపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఇదేసమయంలో టీఎంసీ, ఎన్సీపీలు ఈ విలీన వార్తలను ఖండించనూ లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రుడు ఉండనట్టే.. ఇప్పుడు కూడా వీరు వ్యవహరిస్తారా? అనేది చూడాలి.
అసలు సందిగ్ధత ఇదే..
వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్లో విలీనం అవుతాయంటూ.. చర్చిస్తున్న పార్టీలు.. ప్రస్తుతం అదే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలే. అయితే.. రాహుల్ నాయకత్వాన్ని గతంలో మమత వ్యతిరేకించారు. దీంతో ఆయన తప్పుకొని.. మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. ఆ తర్వాత.. ప్రధాని పీఠం వివాదం కూడా తెరమీదికి వచ్చింది. అప్పుడు కూడా ఎడమొహం పెడమొహం చూపారు. ఇక, రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఇక, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. సో.. ఈ కలివిడి లేకపోవడమే అఖండ కాంగ్రెస్ ఏర్పడుతుందా? లేదా అనే విషయంపై కొనసాగుతున్న పెద్ద సందిగ్థత. మరి ఏం జరుగుతుందో చూడాలి.
