పాకిస్థాన్ కి విస్తరించిన ‘కాక్రోచ్’.. ఇండియాలో ఇంటెలిజెన్స్ షాక్!
ఇండియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కాపీ కొట్టి తాము కాక్రోచ్ అవామీ పార్టీ పెట్టామని పాకిస్థాన్ యువత ప్రకటించుకుంటోంది.
By: Tupaki Political Desk | 23 May 2026 1:00 AM ISTసోషల్ మీడియాలో సెన్సేషన్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దాయాది దేశం పాకిస్థాన్ కి పాకింది. దేశంలో డిజిటల్ ప్లాట్ ఫాంల్లో ప్రధాన పార్టీల ఫాలోవర్లను అధిగమించిన కాక్రోచ్ జనతా పార్టీ పాకిస్థాన్ లో కాక్రోచ్ అవామీ పార్టీ (సీఏపీ)గా ఆవిర్భవించింది. ఇండియాలో జెన్ జీ యువత నుంచి స్ఫూర్తి పొందిన పాకిస్థాన్ యువత కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్ తదితర పేర్లతో డిజిటల్ మాధ్యమాల్లో పేజీలు క్రియేట్ చేస్తున్నారు. ఇండియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కాపీ కొట్టి తాము కాక్రోచ్ అవామీ పార్టీ పెట్టామని పాకిస్థాన్ యువత ప్రకటించుకుంటోంది. అంతేకాకుండా కాపీ కొట్టినా ఫర్వాలేదు.. నినాదం ఒక్కటే అంటూ సమర్థించుకోవడాన్ని విశేషంగా చెబుతున్నారు.
కాక్రోచ్ పోస్టింగులపై నిఘా
మరోవైపు దేశంలో సోషల్ మీడియాలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేజీల్లో కంటెంట్ పై పూర్తి నిఘా ఉంచినట్లు చెబుతున్నారు. యువతలో అసహనాన్ని పెంచేందుకు విదేశీ శక్తులు ఏమైనా ప్రయత్నిస్తున్నాయా? అంటూ నిఘా వర్గాలు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భద్రతా సంస్థల లేఖతోనే ‘ఎక్స్’లో కాక్రోచ్ జనతా పార్టీ ఖాతాను బ్లాక్ చేశారంటున్నారు. అయితే ఇన్ స్టాలో మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ పేజీని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఇన్ స్టాలో గంటగంటకూ ఫాలోవర్లు పెరిగిపోవడం ఆసక్తి రేపుతోంది.
విపక్షాల ఆగ్రహం
ఇన్ స్టాలో కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు కోట్లకు పైగా ఫాలోవర్లు పెరిగిపోవడంపై నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయని అంటున్నారు. కాగా, నిరుద్యోగం, నీట్ పేపర్ లీకు, ఆర్థిక ఇబ్బందులపై జెన్ జడ్ యువత డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా ఉద్యమానికి దిగారని ప్రతిపక్షాలు ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని సమర్థిస్తున్నాయి. యువత వ్యంగ్య నిరసనను అడ్డుకుని అణచివేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఒకే తరహాలో హ్యాష్ ట్యాగులు, ఏఐ సాంగ్స్, సింక్రనైజ్డ్ పోస్టుల వెనుక డీప్ స్టేట్ ఐటీ సెల్స్ హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయని చెబుతున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన
మరోవైపు ప్రస్తుత పరిణామాల పట్ల కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే భద్రతపై ఆయన తల్లిదండ్రులు అనితా దిప్కే, భగవాన్ దిప్కే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తమ కుమారుడు కెరీర్ పై దృష్టి పెట్టాలని వారు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. రాజకీయాలు తమకు ఇష్టంలేదని, వాటి జోలికి వెళ్లకుండా చక్కగా ఉద్యోగం చేసుకోవాలని కోరారు. 30 ఏళ్ల అభిజీత్ దిప్కే స్వరాష్ట్రం మహారాష్ట్రగా చెబుతున్నారు. ఆయన అమెరికాలోని బోస్టన్ వర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసినట్లు చెబుతున్నారు.
