బీజేపీ తీరు ఇంతేనా.. మరిచిపోతున్న సంగతులు.. !
బీజేపీకి ఈ బాధ లేదు. ఎందుకంటే.. తమది జాతీయ పార్టీ అని. . ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే.. జాతీయ స్థాయిలోనే తీసుకుంటారని ఆ పార్టీ నాయకులు సెలవిస్తున్నారు.
By: Garuda Media | 6 March 2026 8:00 PM ISTకూటమి ప్రభుత్వానికి ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం నడుస్తున్నా.. పా ర్టీల మధ్య సమన్వయం ఉండడం లేదన్నది ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ సైతం చెబుతున్న మాట. బీజేపీకి ఈ బాధ లేదు. ఎందుకంటే.. తమది జాతీయ పార్టీ అని. . ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే.. జాతీయ స్థాయిలోనే తీసుకుంటారని ఆ పార్టీ నాయకులు సెలవిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఏం చెబితే అదే చేస్తామని రాష్ట్ర నేతలు చెబుతున్నారు.
వాస్తవానికి ఇదే నిజమని అనుకున్నా.. స్థానికంగా పోటీ చేయాల్సింది.. ఇక్కడి బీజేపీ నాయకులే.. ఇక్కడి ఎమ్మెల్యే. జాతీయస్థాయి నాయకులు ఎవరూ వచ్చి ఏపీలో పోటీ చేయరు. పోనీ... ప్రజలు జాతీయస్థాయి నాయకులు చెబితే ఓట్లేస్తారా? అంటే.. అది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే.. 2019 ఎన్నికల సమయం లో ప్రధాని మోడీ స్వయంగా వచ్చి.. నాలుగు సభల్లో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. కానీ.. ఏం జరిగింది? ఒక్కరంటే ఒక్కరు కూడా గెలుపు గుర్రం ఎక్కలేదు.
సో.. ఎంత జాతీయస్థాయి పార్టీఅయినా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నా... స్థానికంగా ఉన్న ప్రజల ను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం.. ఇక్కడి వారితో మమేకం కావడం.. తమ గ్రాఫ్ను పెంచుకునే దిశగా అడుగులు వేయడం అనేది అత్యంత కీలకం. కానీ.. ఈ చిన్న ఫార్ములాను కమల నాథులు మరిచిపోతున్నారా? లేక.. ఎన్నికలప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారో.. తెలియడం లేదు. ప్రస్తుతం ఎక్కడా సమన్వయం అనేది కనిపించడం లేదు. తిరుమల వ్యవహారం నుంచి మద్యం వరకు.. కూటమి పార్టీలు ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించాయి.
ఈ క్రమంలో సమన్వయం కోసం.. చంద్రబాబు రెండు సార్లు పార్టీలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో జనసేన నాయకులు కొంత మేరకు కదిలారు. క్షేత్రస్థాయిలో వైసీపీపై కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో ఏం జరిగిందన్నది మంత్రులు నాదెండ్ల మనోహర్, దుర్గేష్ చెబుతున్నారు. కానీ.. బీజేపీ విషయానికి వస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఎవరూ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. నిజానికి మండలిలో సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు దాడికి యత్నించినప్పుడు టీడీపీ మంత్రులు అడ్డుపడ్డారు. ఆ తర్వాత.. అయినా.. బీజేపీలో కదలిక రావాల్సి ఉంది. కానీ, ఇప్పటికీ.. తమ రాజకీయాలు తామే చేసుకుంటున్నారు తప్ప.. కూటమి ధర్మాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది.
