Begin typing your search above and press return to search.

ప్రమాదాల పరంపరం : యూపీలో మరో ఘోర రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రైలుప్రమాదం దారుణంగా మారింది.

By:  A.N.Kumar   |   5 Nov 2025 12:13 PM IST
ప్రమాదాల పరంపరం : యూపీలో మరో ఘోర రైలు ప్రమాదం
X

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలోని చునార్ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రైలుప్రమాదం దారుణంగా మారింది. గంగాస్నానానికి వారణాసికి వెళ్తున్న భక్తులు రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు ఢీకొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.




* ప్రమాదం ఎలా జరిగింది?

సమాచారం ప్రకారం, ఈ భక్తులు ప్రయాగ్‌రాజ్-చోపన్ ప్యాసింజర్‌ రైలులో ప్రయాణించి చునార్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్ద దిగారు. వారణాసికి వెళ్ళే మరో రైలు అందుకోవడానికి వారు ప్లాట్‌ఫారమ్ నంబర్ 3 వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అండర్‌పాస్‌ లేదా ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ ఉపయోగించకుండా నేరుగా ట్రాక్ దాటుతుండగా, అదే సమయంలో హావ్రా–కాల్కా మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంగా దూసుకొచ్చింది. ట్రైన్ సమీపానికి చేరుకునేలోపే భక్తులు ట్రాక్ మధ్యలో ఉండటంతో ప్రమాదం తప్పలేదు. రైలు వారిని ఢీకొట్టడంతో వారి శరీరాలు తీవ్రంగా దెబ్బతిని, ముక్కలుగా మారిపోయాయి.




* మృతుల సంఖ్య పెరిగే అవకాశం

అధికారులు ప్రారంభంగా ఆరుమంది మృతి చెందారని ధృవీకరించారు. అయితే స్థానిక వర్గాలు, సాక్షులు చెప్పిన ప్రకారం మృతుల సంఖ్య ఎనిమిది వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

* రక్షణ చర్యలు

ప్రమాదం జరిగిన వెంటనే జీఆర్‌పీ , ఆర్‌పీఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని రక్షణ చర్యలు చేపట్టాయి. ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను సేకరించి గుర్తింపు ప్రక్రియ ప్రారంభించారు.

ప్రమాదం కారణంగా చునార్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కొద్ది సేపు రైలు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు.

* దేవ్ దీపావళి కోసం భక్తుల ప్రయాణం

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారు సోనభద్ర జిల్లాకు చెందినవారు. వారు దేవ్ దీపావళి పర్వదినం సందర్భంగా గంగానదిలో స్నానం చేసేందుకు వారణాసికి వెళ్తున్నారు. భక్తి యాత్ర ఈ దుర్ఘటనతో విషాదంగా మారింది.

చునార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదం మానవ తప్పిదం కారణంగా జరిగినదని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ వాడకుండా ట్రాక్ దాటడం ఎంత ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన గుర్తు చేసింది.

ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ఆదేశించింది.