Begin typing your search above and press return to search.

ఉండిలో పోటీపై రఘురామ కీలక వ్యాఖ్యలు... తెరపైకి రామరాజు టాపిక్!

ఈ సమయంలో జరిగిన పలు కీలక పరిణామాల అనంతరం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   12 April 2024 1:27 PM GMT
ఉండిలో పోటీపై రఘురామ కీలక వ్యాఖ్యలు...  తెరపైకి రామరాజు టాపిక్!
X

గతకొన్ని రోజులుగా రఘురామ కృష్ణంరాజు పోటీ చేసే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ - బీజేపీ - జనసేన... పార్టీ ఏదైనా నరసాపురం ఎంపీ అభ్యర్థి మాత్రం తనే అన్నస్థాయిలో మాట్లాడారని చెప్పే రఘురామకు ఆ టిక్కెట్ దక్కని సంగతి తెలిసిందే. ఈ సమయంలో జరిగిన పలు కీలక పరిణామాల అనంతరం ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

పైగా వాటికి బలం చేకూరుస్తున్నారు అన్నట్లుగా తనను స్పీకర్ గా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ రఘురామ చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తిగా మారాయి. ఈ నేపథ్యంలో... ఉండి నియోజకవర్గం టిక్కెట్ ను రఘురామకు ఇస్తున్నారని.. ఇప్పుడున్న రామరాజుని తప్పించబోతున్నారని రకరకాల కథనాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి! ఇదే సమయంలో... ఉండి టీడీపీ ఎమ్మెల్యే రామరాజు కూడా ఇదే సంకేతాలిచ్చారని చెబుతున్నారు!

ఈ సమయంలో తాజాగా ఈ విషయంపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను ఉండి నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు అని అంటూనే... స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో... ఒక వైపు వైసీపీకి టచ్ లో ఉంటూనే... అంటూ నర్మగర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి!

అవును... తాజాగా మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణమ్రాజు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ అంశంపై స్పందించారు. ఇందులో భాగంగా.. తాను ఏనాడూ ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పలేదని.. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీచేసి చట్టసభల్లో ఉంటానని మాత్రమే చెప్పినట్లు తెలిపారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఈ విషయంలో స్థానికత అంశం తెరపైకి తెస్తున్నాయని అన్నారు.

ఇదే సమయంలో... తాను ఉండి టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు గురించి ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదని చెప్పిన రఘురామ... తనను లోకల్ కాదని అంటుంటేనే క్లారిటీ ఇచ్చే క్రమంలో స్పందించినట్లు తెలిపారు! ఇదే సమయంలో... ఉండి తన సొంత నియోజకవర్గం అని.. తాను ఉండిలోనే నివాశం ఉంటున్నానని తెలిపిన రఘురామ... ఎమ్మెల్యే మాత్రం భీమవరంలో నివాసం ఉంటున్నారని చెప్పే ప్రయత్నం చేశారు.

ఇక తనకు ఉండి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే... తనకు ప్రత్యర్థిగా రంగనాథ రాజుని బరిలోకి దించుతారని కూడా తెలుస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా... పోటీలో తాను ఉండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో ఉండిలో జూదగాళ్లు, గ్యాంబ్లర్లు ఈయనే ఉండాలని కోరుకుంటే కోరుకోవచ్చు కానీ.. రాష్ట్రంలో ప్రజలు మాత్రం తానే ప్రజాక్షేత్రంలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సమయంలో... 40 మంది గ్యాంబ్లర్ కోరికా.. రాష్ట్రంలోని ప్రజల కోరికా అనే విషయంలో చంద్రబాబుకు ఒక క్లారిటీ ఉంటుందని తెలిపారు. అలా అని రామరాజుకి టిక్కెట్ ఇవ్వకూడదని తాను అనడం లేదని అంటూనే... ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం గ్యాంబ్లర్ల కోరిక అన్నట్లుగా వ్యాఖ్యానించారనే చర్చ ఇప్పుడు వైరల్ గా మారుతోందని అంటున్నారు!

అనంతరం... ఒకపక్క వైసీపీతో మాట్లాడుకుంటూ... ఆ క్రమంలో పార్టీని అల్లరి చేయడం కరెక్ట్ కాదని చెబుతు... పార్టీ ఎప్పుడూ గ్యాంబ్లర్ల ఇంట్రస్ట్ మేరకు కాకుండా, స్టేట్ ఇంట్రస్ట్ మేరకు నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం గమనార్హం! మరి ఈ వ్యాఖ్యలు ఉండిలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నాయనేది వేచి చూడాలి!