Begin typing your search above and press return to search.

సిక్కోలుకు ఎయిర్ పోర్టు...దశ తిరిగినట్లే !

ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లాగా శ్రీకాకుళంని చెబుతారు. ప్రపంచంలోని ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం జిల్లా వాసులే కనిపిస్తారు.

By:  Satya P   |   17 May 2026 7:00 AM IST
సిక్కోలుకు ఎయిర్ పోర్టు...దశ తిరిగినట్లే !
X

ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లాగా శ్రీకాకుళంని చెబుతారు. ప్రపంచంలోని ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం జిల్లా వాసులే కనిపిస్తారు. పొట్ట చేత బట్టుకుని వలస వెళ్ళి అక్కడ జీవితాలను గడిపేవారుగా వీరిని చూస్తారు. ఉన్న ఊరికి వదిలేసి ఉపాధి వెతుక్కుంటూ పోతున్నారు అంటేనే జిల్లా దైన్య స్థితిని అర్థం చేసుకోవాలి. అలాంటి శ్రీకాకుళం జిల్లాకు కూటమి ప్రభుత్వం వచ్చాక మహర్దశ పడుతోంది. వరసబెట్టి భారీ ప్రాజెక్టులను ఉత్తరాంధ్రకు తీసుకుని రావడంతో అందరి కంటే ఎక్కువగా ప్రయోజనం పొందేది శ్రీకాకుళం జిల్లా వాసులే అని అంటున్నారు. వారి ఇక మీదట వలసలకు స్వస్తి చెప్పి ఉత్తరాంధ్రాలోనే ఉపాధి చూసుకుని తన సొంత వారితోనే కలసి ఉండేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతే కాకుండా శ్రీకాకుళం జిల్లాలోనూ అనేక ప్రాజెక్టులను తీసుకుని రావడం ద్వారా ఉన్న చోట నుంచి కదలకుండా దర్జాగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.

వరాలు ప్రకటించిన బాబు :

ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ప్రత్యేకించి శ్రీకాకుళం ప్రగతి గురించి అనేక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళం జాతకమే మారిపోతుందని బాబు భరోసా ఇచ్చారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయటంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని బాబు తెలిపారు.

రివర్స్ వలసలు :

ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలలో అనేక పరిశ్రమలను ప్రాజెక్టులను తీసుకుని వస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అందులో భాగంగా గత నెలాఖరులో విశాఖలోని గూగుల్ కంపెనీకి శంకుస్థాపన చేశామని చెప్పారు. అలాగే లక్ష కోట్లతో రిలయన్స్ కూడా డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి ఐటీ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లతో ఉత్తరాంధ్ర దశా దిశా పూర్తిగా మారుతుందని చంద్రబాబు వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసలు వెళ్లటం కాదని, ఉత్తరాంధ్రకే ఇతర ప్రాంతాల నుంచి వలసలు వచ్చేలా చర్యలు తీసుకున్నామని బాబు చెప్పడం విశేషం.

పలాసలో ఎయిర్ పోర్టు :

ఇక శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా మరో ఎయిర్ పోర్టు కూడా నిర్మించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చంద్రబాబు చెప్పారు. మంచి వనరులు కూడా ఉన్న జిల్లాగా శ్రీకాకుళాన్ని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ప్రజా భాగస్వామ్యంతో అంతా కలిసి ఓ టీమ్ గా మారి శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుదామని బాబు పిలుపు ఇచ్చారు. భోగాపురం ఎయిర్ పోర్టు జూలైలో ప్రారంభించబోతున్నామని అలాగే శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందని బాబు తెలిపారు.

సాగు నీటి ప్రాజెక్టుల ఫోకస్ :

శ్రీకాకుళం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టుల మీద ప్రభుత్వం పూర్తి ఫోకస్ పెడుతోందని బాబు చెప్పారు. మద్దువలస స్టేజ్ 2 జనవరి 2027 ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అలాగే హీరమండలం ఎత్తిపోతల 2027 ఏప్రిల్, వంశధార ఫేస్ 2 స్టేజ్ 2 జూలై, జంఝావతి 2027 నాటికి పూర్తి చేస్తామని బాబు సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఆరు దశాబ్దాల కలగా ఉన్న నేరడి బ్యారేజ్ ని . వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే కాదు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా కృషి చేస్తామని చెప్పారు. మొత్తానికి ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చారు. జిల్లాకు మహర్దశని తీసుకుని వస్తున్నామని స్పష్టం చేసారు. ఈ విధంగా చూస్తే చంద్రబాబు జిల్లా పర్యటన సక్సెస్ అయిందనే చెప్పాలి.