పీ-4 మహామంత్రం.. దేశం మొత్తం మనవైపే: చంద్రబాబు
సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్ షిప్)ను పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
By: Tupaki Desk | 11 April 2025 10:06 AMసీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్ షిప్)ను పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఒక కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత.. దాని అమలు బాధ్యతలను ఏ ప్రభుత్వమైనా.. అధికారులకు, లేదా మంత్రులు, నాయకులకు మాత్రమే పరిమితం చేస్తుంది. అయితే.. చంద్రబాబు వ్యూహమే వేరు. తాను కాకుండా.. ఇతరులకు దీనిని అప్పగిస్తే.. వారు ఏం చేస్తారో అనే బెంగ ఉంది.
దీంతో సీఎం చంద్రబాబు పీ-4పై స్వయంగా ఆయనే ముందుకు కదులుతున్నారు. దీనిలో భాగంగానే.. ఓ నాలుగు రోజుల కిందట ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ల గ్రామంలో పర్యటించారు. అక్కడ పీ4 కార్యక్రమానికి ఎంపికైన బంగారు కుటుంబం లబ్ధి దారులతో స్వయంగా మాట్లాడారు. వారికి కాఫీ తయారు చేసి మరీ ఇచ్చారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పీ-4కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందో కూడా వివరించారు.
ఇక, తాజాగా శుక్రవారం చంద్రబాబు.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం, వడ్లమాను గ్రామంలో పర్యటిం చారు. ఈ గ్రామంలో కూడా.. పీ4 పథకానికి ఎంపికైన బంగారు కుటుంబంతో చంద్రబాబు భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నక్కబోయిన వెంకటయ్య కుటుంబాన్ని పీ4 కార్యక్రమం కింద ఎంపిక చేశారు. ఈ క్రమంలో నేరుగా చంద్రబాబు ఆ ఇంటికే వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. పీ4 ద్వారా జరిగే లబ్ధిని వివరించారు. ఈ గ్రామంలో కుల వృత్తులు చేసుకునే వారు ఎక్కువగా ఉండడంతో వారిని కూడా కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పీ4ను మహా మంత్రంతో పోల్చారు.అంతేకాదు.. ఈ కార్యక్ర మం సక్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీవైపు చూడడం ఖాయమని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల మంది పేదలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు.