ఇంకా నయం.. వాటికన్ అనలేదు: చంద్రబాబు సెటైర్లు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని)పై సీఎం చంద్రబాబు సెటైర్లు పేల్చారు.
By: Garuda Media | 9 April 2026 3:16 PM ISTవైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని)పై సీఎం చంద్రబాబు సెటైర్లు పేల్చారు. ''మావిగన్ అంట మావిగన్.. మూడు రాజధా నులు అన్నాడు.. మూడు ముక్కలాట అడారు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఇంకా నయం.. వాటికన్ (క్రైస్తవుల కోసం ఉన్న ప్రత్యేక దేశం) అనలేదు'' అని వ్యాఖ్యానించారు.
వెయ్యి మంది సైకోలు, విధ్వంసకారులు వచ్చినా.. అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. అమరావతికి పార్లమెంటులో 49 పార్టీలకు చెందిన సభ్యులు మద్దతు పలికారని తెలిపారు. ఒక్క వైసీపీ మాత్రమే విషం కక్కుతోందన్నా రు. జగన్ మాయలో పడి వైసీపీ నాయకులు అందరూ సైకోలుగా మారారని వ్యాఖ్యానించారు.
మహిళల పేరుతో ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై సైకో బ్యాచ్ దాడులు చేయడం దుర్మార్గమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ పత్రిక ఏమీ అనకపోయినా.. ఏదో మహిళలను కించ పరిచారంటూ దాడులు చేయడం దారుణమన్నారు. వైసీపీ హయాంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గతంలో అనేకసార్లు వైసీపీనాయకులు మహిళలను కించపరిచారని గుర్తు చేశారు. అమరావతిపై ప్రశ్నిస్తే..(పత్రిక) ఓ 50 మందిని రోడ్డుపైకి తీసుకువచ్చి.. యాగీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
మహిళల పేరుతో వైసీపీ చేస్తున్నదంతా డ్రామాయేనని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రతివిషయాన్నీ ప్రజలు గమనించాలన్నారు. ''ఇప్పటి వరకు జగన్ మాత్రమే సైకో అనుకున్నాం. కానీ.. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ సైకోలే'' అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి జోలికి వస్తే.. తాట తీస్తామని హెచ్చరించారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
