చంద్రబాబుకు భారీ బాధ్యత.. మోడీ కసరత్తు పూర్తి!
ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ బాధ్యతను అప్పగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారా? అధికారికంగా.. బుధవారం ఈ విషయాన్ని ప్రకటించనున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు.
By: Garuda Media | 10 Jun 2026 12:39 PM ISTఏపీ సీఎం చంద్రబాబుకు భారీ బాధ్యతను అప్పగించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారా? అధికారికంగా.. బుధవారం ఈ విషయాన్ని ప్రకటించనున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి జాతీయ మీడియా వర్గాలు. బుధ, గురువారాల్లో ఢిల్లీ వేదికగా ఎన్డీయే పార్టీ నేతల కీలక సమావేశం జరగనుంది. దీనిలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే చంద్రబాబుకు మోడీ కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.
ఏంటి విషయం..
గత పార్లమెంటు సమావేశాల్లో మోడీ సర్కారు మహిళా రిజర్వేషన్ బిల్లు సహా.. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. అయితే.. పార్లమెంటులో దీనిని విపక్షాలు వీగిపోయేలా చేశాయి. మహిళా రిజర్వేషన్కు.. నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెట్టడం సహా.. పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపట్టరాదని కూడా నిలదీశాయి. దీంతో ఈ బిల్లుపై జరిగిన ఓటింగ్లో విపక్షాలదే పైచేయి అయింది. అనంతరం.. ఈ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
అయితే.. ఎలాగైనా మహిళా బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను ఆమోదించుకుని తీరాలని మోడీ సర్కారు పంతంతో ఉంది. కానీ.. ఎలా సాధించాలి? అనేదే కీలక అంశం. ఇలాంటి అనేక సందర్భాల్లో చంద్రబాబు గతంలో చక్రం తిప్పారు. వాజపేయి ప్రభుత్వంఏర్పాటు సమయంలో ఆయన అన్ని పక్షాలతో మాట్లాడి.. ఎన్డీయే కన్వీనర్గా వారిని ఒప్పించారు. మోడీ హయాంలో పెద్దనోట్ల రద్దు అనంతరం.. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు వేసిన కమిటీలోనూ చంద్రబాబు ఉన్నారు.
ఇలా.. ఎప్పుడు అవసరమైతే. అప్పుడు చంద్రబాబు తన చక్రం అడ్డం వేసి.. కేంద్రానికి సహాయం చేస్తున్నారు. తాజాగా మహిళా బిల్లు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపు అంశంపై పంతానికి పోతున్న విపక్షాలతో చర్చించి.. వారిని లైన్లో పెట్టే కీలక బాధ్యతలను ప్రధాని మోడీ.. చంద్రబాబుకు అప్పగించ నున్నారని జాతీయ మీడియా పేర్కొంది. బుధ, గురువారాల్లో జరిగే.. ఎన్డీయే నేతల సమావేశంలో దీనిపై ప్రధానే స్వయంగా ప్రకటన చేయనున్నట్టు తెలిపింది. కాంగ్రెస్ను వ్యతిరేకించినా.. ఆ పార్టీతో బాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలానే ఉత్తరాది పార్టీలు కూడా..బాబును గౌరవిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాబుపై మోడీ కీలక బాధ్యత పెడుతున్నారని మీడియా చెబుతోంది.
