Begin typing your search above and press return to search.

ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా... సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

సోమవారం ఉదయం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయమైన సీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జీ ప్లస్ 7 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 12:43 PM IST
ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా... సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమైన తర్వాత తొలి ప్రభుత్వ భవనం సిద్ధమైంది. సోమవారం ఉదయం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయమైన సీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జీ ప్లస్ 7 అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు. సర్వాంగ సుంధరంగా తీర్చిదిద్దిన సీఆర్డీఏ భవనాన్ని రాజధాని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ఎంపిక దగ్గర నుంచి గత ప్రభుత్వంలో భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొన్న అవమానాల వరకు చంద్రబాబు అనేక విషయాలపై భావోద్వేగంతో మాట్లాడారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా చేశారని యూపీఏ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టిన సీఎం చంద్రబాబు రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలనే అమరావతిని ఎంపిక చేసినట్లు పునరుద్ఘాటించారు. ‘‘రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించడానికి నాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కమిటీ వేసింది. రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేసేశారు లేనిపోని పంచాయితీ పెట్టారు’’ అంటూ నాటి సంఘటనలను చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రం మధ్యలో రాజధాని పెడితే అందరికీ బాగుంటుందని అమరావతిలో ఏర్పాటు చేశామని వివరించారు.

అమరావతిలో బెస్ట్ రాజధాని నిర్మిస్తున్నాం... గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి భూమి కావాలని, కానీ ప్రణాళికాబద్దంగా రాజధాని నిర్మించగలమా? అని అనుమానాలు వ్యక్తం చేశారని అన్నారు. సైబరాబాద్ నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణం ప్రారంభించామని, భూమి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమరావతి రైతులు దారి చూపారని కొనియాడారు. ‘‘రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ అనే కొత్త విధానాన్ని తెచ్చాం. ప్రపంచంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ విధానం లేదు... మనమే ఈ విధానాన్ని తెచ్చాం... సక్సెస్ చేశాం.’’ అంటూ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

అమరావతి పనుల రీ-స్టార్ట్ తర్వాత మొదటిగా సీఆర్డీఏ బిల్డింగ్ ప్రారంభమైందన్న విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. గత ప్రభుత్వంలో రాజధాని రైతులు చేసిన ఉద్యమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు. అనేక ఉద్యమాలు చేశారు. రైతుల ఉద్యమానికి మద్ధతుగా నేను కూడా జోలె పట్టాను, ఉద్యమానికి అండగా నిలిచాను. పడిన కష్టాలు మరిచిపోవద్దు... మీరు చేసిన త్యాగాల ఫలితాలను మీరే అనుభవించాలి. నేను దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను.’’ అని రైతులకు భరోసా ఇచ్చారు. ఫేజ్-1లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చారు. భూములిచ్చినందుకు గత పాలకులు మిమ్మల్ని నానా హింసలు పెట్టారు. రాజధాని ఎడారి అన్నారు. వేశ్యల రాజధాని అన్నారు. ఎంతో అపహాస్యం చేశారు. మీకు రెట్టింపు గౌరవం దక్కేలా...రెట్టింపు ఫలాలు అనుభవించేలా మేము చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

హైటెక్ సిటీ నిర్మాణం మొదలు పెట్టే నాటికి అక్కడ ఎకరం రూ. లక్ష ఉండేదని, కానీ, ఇప్పుడు అదే భూమి ఎకరం రూ.177 కోట్లకు చేరిందని ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతి ప్రాజెక్టు సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో నిర్మిస్తున్నామని. విమర్శలు చేసే వారంతా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అమరావతి ఓ మునిసిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించాల్సివుందని అన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్త విధానం అమరావతి నుంచే ప్రారoభం కావాలని సీఎం పిలుపునిచ్చారు. అమరావతి అభివృద్ధికి ఆటంకాలు లేవని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతిని క్వాంటం వ్యాలీ చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని తెలిపారు. ‘‘ఒకప్పుడు ఐటీ.. ఇప్పుడు క్వాంటం, డేటా సెంటర్, ఏఐ వంటి టెక్నో రంగాలదే హవా’’ అని సీఎం స్పష్టం చేశారు.

అమరావతి రైతుల అభివృద్ధికి అండగా ఉంటాం, ఒకసారి జరిగిన తప్పునకు రైతులు, నేను, రాష్ట్రం ఎంత నష్టపోయింది. మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు... కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలి. పవన్ కళ్యాణ్, బీజేపీలతో కలిసి ముందుకెళ్తున్నాం మీరంతా సహకరించాలి. నా ఆలోచన ఎప్పుడూ ప్రజల కోసం, వారి భవిష్యత్ కోసమే. విశాఖలో కూడా అద్భుతంగా అభివృద్ధి జరుగుతోంది. దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వస్తోంది. రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దేశంలోని పవిత్ర దేవాలయాలు, మసీదులు, చర్చీల నుంచి మట్టి, జలాలు తెచ్చి శంకుస్థాపన చేశాం. రాజధాని అభివృద్ధి కోసం ప్రతి రోజూ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతామని అమరావతి రైతులను మరిచేదే లేదని స్పష్టం చేశారు.