Begin typing your search above and press return to search.

బాబు ఢిల్లీ టూర్.. రాజకీయ సంచలనాలేనా ?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   21 May 2025 3:23 AM
బాబు ఢిల్లీ టూర్.. రాజకీయ  సంచలనాలేనా ?
X

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. వాస్తవానికి బాబు ఈ నెల 24న నీతి అయోగ్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కి మాత్రమే అటెండ్ కావాల్సి ఉంది అని అంటున్నారు. అయితే ఈ నెల 22 నుంచి బాబు ఢిల్లీలో ఉండబోతున్నారు. ఆయన వరసబెట్టి కేంద్ర మంత్రులను తన పర్యటనలో కలవబోతున్నారు.

ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర ముఖ్య శాఖలను చూసే కేంద్ర మంత్రులను కలవబోతున్నారు అని అంటున్నారు ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన పధకాలు కార్యక్రమాలు నిధులు ఇవన్నీ చర్చించడానికి ఆయన కేంద్ర మంత్రులతో భేటీలు వేయబోతున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బాబు ప్రత్యేకంగా భేటీ అవుతారు అని అంటున్నారు. ఇక్కడే రకరకాలైన రాజకీయ స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి ఏపీలో చూస్తే లిక్కర్ స్కాం లో లిస్ట్ ఏ 39 దాకా పాకింది. సెప్టెంబర్ నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది.

దాదాపుగా పెద్ద తలకాయలు అన్నింటినీ అరెస్ట్ చేశారు. ఒక మిగిలింది ఎవరో అందరికీ తెలుసు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి జగన్ ని అరెస్ట్ చేస్తారు అని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కోడై కూస్తోంది. దాంతో ఈ కేసులో విచారణ సందర్భంగా ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలు అన్నీ కూడా కేంద్ర హోం మంత్రికి వివరించి అక్కడ నుంచి కూడా యాక్సెప్టెన్స్ తెచ్చుకుంటారు అని అంటున్నారు.

అంతే కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి ఆ వైపు నుంచి ఏమైనా నరుక్కు వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే బాబు ఢిల్లీ టూర్ లో చాలా విషయాలే ఉండబోతున్నాయని అంటున్నారు.

ఇప్పటికే ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. అది జరిగి రోజుల వ్యవధి కాకుండానే చంద్రబాబు ఢిల్లీ టూర్ చేస్తున్నారు అంటే చాలా కీలకమైన విషయాలే ఉంటాయని అంటున్నారు. మహానాడు పనులు ఒక వైపు ఉండగా ఇంత సడెన్ గా బాబు ఢిల్లీకి మూడు రోజుల పాటు పర్యటనకు వెళ్ళడం అంటే రాజకీయంగా అది చాలా విశేషమైనదే అంటున్నారు.

బాబు ఢిల్లీ పెద్దలతో అనేక అంశాలు చర్చిచి మరీ వస్తారని ఆ మీదట వచ్చే వారం అంతా ఏపీ రాజకీయాల్లో సంచలనాలే నమోదు అవుతాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో మే నెల ఊరకే పోదని అతి పెద్ద రాజకీయ ప్రకంపనలు సృష్టించి కానీ ఈ నెల ముగియదు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.