మరో 15 ఏళ్లు అధికారంలో ఉండాలి: చంద్రబాబు
ఈ క్రమంలో 2024లో ఎన్డీఏ విజయం ఊహించని విప్లవం. అధికారంలోకి వచ్చాక 7 శ్వేత పత్రాలు ఇచ్చామన్నారు.
By: Garuda Media | 4 Aug 2026 5:02 PM ISTరాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు కొనసాగాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఈ విషయంలో ఆలోచన చేయాలని, వైకుంఠపాళీ రాజకీయాలు చేస్తే.. రాష్ట్రం ఎప్పటికీ.. అభివృద్ధి చెందదని అన్నారు. 2019-24 మధ్య ప్రజలు భయంతో, రాష్ట్రంలో విధ్వంసంతో జీవనం గడిపారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2024లో ఎన్డీఏ విజయం ఊహించని విప్లవం. అధికారంలోకి వచ్చాక 7 శ్వేత పత్రాలు ఇచ్చామన్నారు.
ఒక ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయం ఓ ఉదాహరణగా చంద్రబాబు పేర్కొన్నారు. డేటా సెంటర్లు, ఐటీ, పోర్టులు, ఎయిర్ పోర్టులు, స్టీల్ పరిశ్రమలతో ఓ గ్రోత్ ఇంజన్గా మారుతోందన్నారు. 2014లో విభజన తర్వాత ఏపీ పరిస్థితి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిందన్నారు. 58 శాతం మంది జనాభా ఉంటే 46 శాతమే వనరులు ఉన్నాయని తెలిపారు. రాజధాని లేకుండా పోయిందన్నారు. విభజన సమయంలో ఆస్తుల పంపకం కూడా సవ్యంగా జరగలేదన్నారు.
2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందని పేర్కొన్న చంద్రబాబు అన్ని విధాలా రాష్ట్రం నష్టపోయిందన్నారు. ''వ్యవస్థలు కుప్పకూలాయి. శాంతిభద్రతలు లేవు. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. పరిశ్రమలు పారిపోయాయి. 2024లో కూటమి అధికారంలోకి వస్తూనే ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాం. సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని, ప్రాంతీయ సమతుల్యతను కాపాడాం. రాజధానితో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టాం. ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టాం'' అని వివరించారు.
మీడియా కూడా..
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మీడియా కూడా ప్రజలకు వివరించే గురుతర బాధ్యతను తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. కేవలం వార్తలు రాయడమే కాకుండా.. ప్రజల్లో ఆలచన రేకెత్తించేలా కూడా సహకరించాలన్నారు. మీడియా తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. 2019-24 మధ్య కాలంలో నాటి ప్రభుత్వం ప్రజలను వేధించిన తీరుపై మీడియా కూడా ప్రజలకు వివరించాలన్నారు. ఆ ప్రభుత్వం ప్రజలను అణగదొక్కిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంచి చెడులను కూడా మీడియా ప్రస్తావించాలని కోరారు.
