రండి.. ప్రారంభించండి: మోడీకి చంద్రబాబు ఆహ్వానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీకి రావాలంటూ.. సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు.
By: Garuda Media | 10 April 2026 11:09 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీకి రావాలంటూ.. సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు. విజయనగరం జిల్లాలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీ య విమానాశ్రయం నిర్మాణ పనులు దాదాపు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభింపచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
ఈ క్రమంలోనే ప్రధాని మోడీని ఆహ్వానించాలని నిర్ణయించారు. దీనికిగాను.. 2 నెలల్లో.. 4 తేదీలను సీఎం చంద్రబాబు ప్రధానికి సూచించారు. జూలై 5 లేదా 8, ఆగస్టు నెలలో 17 లేదా 19 తేదీల్లో కుదిరిన సమయం చెప్పాలని.. అప్పుడు ముహూర్తం నిర్ణయించుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయం ఆహ్వానంతోపాటు సమాచారం కూడా అందించింది.
జూన్ 30 లోగా పనులు పూర్తి..
ఈ ఏడాది జూన్ 30వ తేదీలోగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ.. జీఎంఆర్ కు ప్రభుత్వం గడువు నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల కిందట.. విమానాశ్రయం పనులు పూర్తయిన వీడియోలను సంస్థ షేర్ చేసింది. లోపలి నిర్మాణ పనులు సహా.. విమానాశ్రయం ఎలివేషన్ కూడా పూర్తయింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
విమానాశ్రయం ప్రత్యేకతలు ఇవీ..
+ విజయనగరం జిల్లా భోగపురంలో నిర్మాణంలో ఉన్న విమానాశ్రయాన్ని జిఎంఆర్ సంస్థ నిర్మిస్తోంది.
+ ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టారు.
+ 2015లోనే నిర్మాణ పనులకు అనుమతులు వచ్చాయి.
+ విశాఖపట్నం నుండి 44 కిలో మీటర్లు, విజయనగరం నుండి 23 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
+ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది అతి పెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది.
+ భవిష్యత్తులో వైజాగ్ బీచ్ కారిడార్, వైజాగ్ మెట్రో ద్వారా అనుసంధానిస్తారు.
+ ఏపీలో ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించే రెండో అతి పెద్ద ప్రాజెక్టు ఇదే.
+ 2015-16 మధ్య రాజధాని అమరావతికి మోడీ శ్రీకారం చుట్టారు.
