కూటమి సర్కారు ప్రోగ్రెస్ రిపోర్టులు: బాబు రెడీ
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పరిశ్రమల రాక, శాంతి భద్రతలు ఇలా.. అనేక అంశాల్లో పురోగతి కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
By: Garuda Media | 22 Jun 2026 9:36 AM ISTఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పరిశ్రమల రాక, శాంతి భద్రతలు ఇలా.. అనేక అంశాల్లో పురోగతి కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై కూటమి సర్కారు చేసిన మంచిని ప్రజలకు వివరించేలా.. ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వాలని నిర్ణయించారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం విధ్వంసమైందని.. ఆర్థికం నుంచి పెట్టుబడుల వరకు కూడా.. అన్ని రంగాలు దెబ్బతిన్నాయన్నారు. వీటిపై ఇప్పటికే 7 శ్వేత పత్రాలను విడుదల చేశారు. తాజాగా వాటికి అనుబంధంగా మూడు ప్రోగ్రెస్ రిపోర్టులను ప్రజల మధ్యకు తీసుకురానున్నారు.
ఇవీ.. ప్రోగ్రెస్ రిపోర్టులు..
1) గుడ్ గవర్నెన్స్: గత రెండేళ్లలో ప్రభుత్వ పాలనపై గుడ్ గవర్నెన్స్ పేరుతో ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయనున్నారు. వ్యవ సాయం నుంచి రెవెన్యూ వరకు అన్ని పాలనా వ్యవహారాలలోనూ ప్రజలకుఅ వసరమైన అన్ని సేవలను అత్యంత పారదర్శకం గా అందించిన విధానాలనుదీనిలో వివరించనున్నారు. వ్యవసాయం, పెట్టుబడులు, పారిశ్రామిక రంగం, పర్యాటక, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో ప్రభుత్వం అనుసరించిన విదానాలను దీనిలో ప్రధానంగా పేర్కొంటారు.
2) వెల్ఫేర్-ఎంపవర్మెంట్: గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నెల నెలా 1వ తేదీనే ఇస్తున్న సామాజిక భద్రతా పింఛన్ల వంటి విషయాలపై వెల్ఫేర్-ఎంపవర్మెంట్ పేరుతో ప్రోగ్రెస్ రిపోర్టును అందించనున్నారు. అదేవిధంగా పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా తీసుకువచ్చిన పీ-4 అమలు. తద్వారా లబ్ధి పొందిన బంగారు కుటుం బాలు.. సమాజంలో పేదల జీవనాన్ని మార్చేలా ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలపై ఈ ప్రోగ్రెస్ రిపోర్టులో వివరించను న్నారు.
3) డెవలప్మెంట్: రాష్ట్రంలో గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిని వివరించనున్నారు. అదేసమయంలో వైసీపీ హయాంలో రాష్ట్రం ఏ విధంగా భ్రష్టు పట్టింది.. పెట్టుబడి దారులు ఎలా తరలిపోయారన్న విషయాలపై ఇప్పటికే ఇచ్చిన శ్వేత పత్రాన్ని దీనికి జత పరచనున్నారు. అలానే గత రెండేళ్లలో సాధించిన 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు.. తద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కూడా దీనిలో వివరిస్తారు. అలానే.. రహదారుల నిర్మాణం, కేంద్రం నుంచి తీసుకువస్తున్న నిధులు, అమరావతి, పోలవరం తదితర ప్రాజెక్టుల వివరాలను కూడా దీనిలో పొందుపరచనున్నారు. ఈ మూడు ప్రోగ్రెస్ రిపోర్టులను ప్రజల మధ్య ఉంచాలని చంద్రబాబు నిర్ణయించారు.
