చంద్రబాబు @ 1995.. మంత్రులతో మొదలుపెట్టిన సీఎం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తనలో 1995 ముఖ్యమంత్రిని చూస్తారని ప్రకటించారు చంద్రబాబు.
By: Tupaki Desk | 6 May 2025 8:30 PMముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తనలో 1995 ముఖ్యమంత్రిని చూస్తారని ప్రకటించారు చంద్రబాబు. తొలిసారి 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రిగా చేపట్టిన చంద్రబాబు వినూత్న కార్యక్రమాలతో అధికార యంత్రాంగాన్ని పరుగెత్తించేవారు. ఆకస్మిక తనిఖీలతో విధి నిర్వహణలో ఉదాసీనంగా వ్యవహరించేవారిని అక్కడికక్కడే సస్పెండ్ చేసేవారు. అదేసమయంలో పార్టీ నేతలను కొత్త పంథాలో నడిపారు. తొలిసారి సీఎం బాధ్యతలు, యువరక్తం ఉప్పొంగే వయసులో ఆయన స్పీడు చూసి సీఎం అంటే ఇలా కూడా పనిచేస్తారా? అనుకునేలా చేశారు. ఆ స్పీడుతోనే 1999లో విజయం సాధించారు. ఆ తర్వాత 2004లో అధికార పోవడం, మళ్లీ విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా ఒకసారి, గత ఏడాది మరోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు చంద్రబాబు. కానీ, తొలిసారి పాలనను మళ్లీ కొనసాగించలేదు.
తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనను పరిగెత్తించిన చంద్రబాబు.. మరీ ఎక్కువ పనిష్మెంట్లు ఇస్తున్నారని ఉద్యోగ వర్గాలు దూరమయ్యాయి. ఎంతసేపు పని.. పని అంటూ వెంట పడుతుండటంతో చంద్రబాబును 2004లో ప్రభుత్వం నుంచి దించేలా పనిచేశాయని అంటుంటారు. దీంతో 2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఎంప్లాయి ఫ్రెండ్లీ సీఎంగా మారిపోయారు. కానీ, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ సారి ఓటమికి ఉద్యోగులు కారణం కాకపోయినా, గత ఐదేళ్లలో రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులుతో గత ఏడాది సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను మళ్లీ 1995 సీఎం అవతారం ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు చంద్రబాబు.
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని భావించి ఉద్యోగులకు కొంత సమయం ఇస్తున్నానని, ఈ లోగా అంతా సెట్ రైట్ కావాలంటూ ఆ మధ్య వార్నింగు ఇచ్చారు. తర్వలో ఆకస్మిక తనిఖీలకు వస్తానని, తాను ఎక్కడికి వచ్చేది గంట ముందు మాత్రమే చెబుతానని హెచ్చరించారు సీఎం. అయితే ఆయన ఉద్యోగుల విషయంలో 1995 సీఎం అవతారం ఎత్తకపోయినా, పార్టీ విషయంలో అప్పటి పంథాను తిరిగి అమలు చేయడం మొదలుపెట్టారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో తన మంత్రివర్గ సహచరులతో లంచ్ భేటీలు నిర్వహించిన చంద్రబాబు.. తాజాగా సోమవారం నుంచి ఆ కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు.
ప్రస్తుతం మూడు పార్టీల కూటమితో ప్రభుత్వాన్ని నడుపుతుండటం, ఎన్నడూ లేనట్లు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉండటం వల్ల అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళుతున్నాయట. ఎమ్మెల్యేల అవినీతి, గ్రూపు తగాదాలు, క్రమశిక్షణ రాహిత్యం ఇలా నేతలు,కార్యకర్తలు అందరిపై సీఎంకి ఫిర్యాదులు వెళుతుండటంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారంటున్నారు. జిల్లా మంత్రులు, ఇన్ చార్జి మంత్రులతో లంచ్ భేటీలు నిర్వహించి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడం అభివృద్ధి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నట్లు చెబుతున్నారు.
సోమవారం మొదలుపెట్టిన లంచ్ భేటీల్లో తొలిసారిగా హోంమంత్రి అనిత, కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో సీఎం భేటీ అయ్యారు. మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రివర్గంలో చాన్స్ దక్కించుకున్నారు. వారి సొంత జిల్లాలతోపాటు ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో సమర్థంగా పనిచేయలేకపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఆ ఇద్దరికి సరైన దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు చెబుతున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత జిల్లా విజయనగరం కాగా, ఆయన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ఎక్కువగా పర్యటించడం లేదని సీఎం ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అదేవిధంగా కోనసీమ అంబేద్కర్ జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ క్రిష్ణా జిల్లాకు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు జిల్లాలు రాజకీయంగా ఎంతో కీలకమైనందున మంత్రి మరింత కష్టపడి పనిచేయాలని సీఎం సూచించారంటున్నారు.
అదేవిధంగా హోంమంత్రి అనిత పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సింహచలం ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి అనిత సమన్వయంతో పనిచేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. కాగా, ఇకపై ఇటువంటి లంచ్ భేటీలను తరచూ నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. అన్నిమార్గాల నుంి నివేదికలు తెప్పించుకుంటారని, మంత్రులు కష్టపడి పనిచేస్తే, ఎమ్మెల్యేలు కూడా సరైన మార్గంలో నడుస్తారని సీఎం అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ చార్జులు ఇతర సీనియర్లపై వచ్చే ఫిర్యాదులపై వారితో మాట్లాడి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించినట్లు సమాచారం. పరిస్థితి తీవ్రతను బట్టి అవసరమైతే తనతో చెప్పాలని సీఎం దిశానిర్దేశం చేశారంటున్నారు. ఇకపై ప్రతి నెలా రెండు మూడు లంచ్ భేటీలు నిర్వహించేలా సీఎం ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
1995-98 మధ్య చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా, హైదరాబాద్ సచివాలయంలో ఇలాంటి లంచ్ మీటింగులు జరిగేవని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంతోపాటు మంత్రులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి వీటిని వేదికగా ఉపయోగించుకునేవారు. మళ్లీ ఇన్నాళ్లు అలాంటి కార్యక్రమం నిర్వహించడంపై టీడీపీ కేడర్ ఆసక్తి కనబరుస్తోంది.