Begin typing your search above and press return to search.

కుల గణనలో అడిగే ప్రశ్నలు ఇవే.. కులం అడిగితే చెప్పకపోతే ఏమవుతుంది?

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మనదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కులం గురించి అడుగుతారు.

By:  Tupaki Desk   |   4 May 2025 1:00 AM IST
కుల గణనలో అడిగే ప్రశ్నలు ఇవే.. కులం అడిగితే చెప్పకపోతే ఏమవుతుంది?
X

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మనదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కులం గురించి అడుగుతారు. అయితే, ఒకవేళ ఎవరైనా తమ కులం చెప్పడానికి ఇష్టపడకపోతే ఏమి జరుగుతుంది? ప్రభుత్వం ప్రకటన చేసినప్పటి నుంచి కొంతమంది మదిలో ఈ ప్రశ్న మెదులుతోంది. తమ కులం చెప్పకపోతే ఏమవుతుందో తెలుసుకోవడానికి ముందు, అసలు ఈ గణన ఎలా చేస్తారు. దీనికి సంబంధించిన చట్టాలు ఏమి చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.

ఈ కుల గణన పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని విస్తృతంగా ఉపయోగిస్తారు. జియో-ఫెన్సింగ్ ద్వారా కులగణన జరుగుతుంది. ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఉంటుంది. ఇప్పటివరకు ఎస్సీ-ఎస్టీలకు మాత్రమే ఒక కాలమ్ ఉండేది. ఎందుకంటే వారి గణన మాత్రమే జరిగేది. ఇప్పుడు ఓబీసీ ఉప-వర్గాల కాలమ్‌పై కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ గణనలో దాదాపు 30 ప్రశ్నలు అడుగుతారు. సామాజిక, ఆర్థిక స్థితి కూడా దీని ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ గణన కోసం ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు ఉన్నాయి. ఇది జనగణన చట్టం 1948 ప్రకారం నిర్వహిస్తారు.

తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు:

* మీ వయస్సు ఎంత?

* మీరు స్త్రీనా లేదా పురుషుడా?

* మీకు వివాహం అయిందా లేదా?

* మీరు ఎంతవరకు చదువుకున్నారు?

* మీరు ఏమి చేస్తారు (ఉద్యోగం)?

* మీరు ఎక్కడ నివసిస్తున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు?

* మీరు ఇక్కడ ఎంత కాలం నుండి నివసిస్తున్నారు?

* తప్పుడు సమాచారం ఇస్తే రూ.1000 జరిమానా కూడా విధిస్తారు.

సమాధానం చెప్పడం తప్పనిసరి కాని ప్రశ్నలు:

* మీ మతం ఏమిటి?

* మీరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు?

* మీ ఆరోగ్యం, వైకల్యానికి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నలు

* ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత గుర్తింపు పత్రాలు

ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు జనగణన చట్టంలో కులం చెప్పడం తప్పనిసరి కాదు. కేవలం ఎస్సీ-ఎస్టీల గురించి మాత్రమే అడిగేవారు. కానీ ఇప్పుడు కుల గణన జరగబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరి కులం అడుగుతారు. కులం చెప్పడం తప్పనిసరి చేయాలా లేదా ఐచ్ఛికంగా ఉంచాలా అనే దానిపై ఇంకా ఎటువంటి చట్టం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో నోటిఫికేషన్ జారీ చేసి చట్టం చేసిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది.