బాబు మాట: కుల చిచ్చుపై ఉక్కుపాదం.. సాధ్యమేనా.. !
కుల చిచ్చుపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
By: Tupaki Desk | 10 Feb 2026 8:00 PM ISTకుల చిచ్చుపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఈ వ్యవహారంపై ఆయన నిర్దిష్టంగా సూచనలు కూడా చేశారు. కరెక్టే.. ఏ ప్రభుత్వమైనా కుల చిచ్చుకు, మత విద్వేషాలకు ప్రాధాన్యం ఇవ్వదు.. ఇవ్వకూడదు కూడా. ఎక్కడికక్కడ వాటిని అణిచేయాల్సిందే. కానీ, ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగా ఏపీ లో పరిస్థితి ఉందా? అనేది ప్రశ్న.
ఇతర రాష్ట్రాలకు భిన్నమైన వాతావరణం.. భిన్నమైన కుల వ్యవస్త, రాజకీయాలు కూడా ముడిపడిపోయాయి. దీంతో సర్కారు కుల చిచ్చును ఉక్కుపాదంతో ఆపేయగలదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంతే కాదు.. ప్రస్తుతం ఎవరు కాదన్నా.. ఔనన్నా.. రాజకీయంగా కులాల వారీగా నాయకులు కూడా వేరయ్యారు. ప్రస్తుతం ఉన్న మూడు పార్టీలు కూడా.. మూడు కులాలకు ముడిపోయాయన్నది నిర్వివాదాంశం. దీని నుంచి పార్టీలను ముందుగా బయట పడేసే ప్రయత్నం చేస్తే తప్ప.. ప్రభుత్వం అనుకున్నది సాధించడం కష్టం.
దీనిని సాకారం చేసుకునేందుకు పార్టీలు ముందుగా.. కులాల రహితంగా మార్పు చెందాలి. ఇది సాధ్య మేనా? అనేది ప్రశ్న. ఇటీవల.. తమిళనాడులో కమ్మ సామాజిక వర్గం నేతలు.. కమ్మనాడును నిర్వహించా రు. వాస్తవానికి కమ్మలు తమిళనాడులో ఉన్నారా? అంటే లేరనే చెప్పాలి. ఒకవేళ ఉన్నా.. ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదు. మరి అక్కడ ఎందుకు కమ్మనాడు నిర్వహించారన్నది చూస్తే.. ఏపీలో వారికి అనుమతి ఇవ్వలేదు. తద్వారా.. ఇతర కులాల వారు నిర్వహించుకునే కార్యక్రమాలకు అనుమతి నిరాకరించే అవకాశం ఉంటుంది.
కానీ, ఇది సాధ్యంకాదు. ఎందుకంటే.. కమ్మలు అక్కడ సమావేశం నిర్వహించుకున్నా.. రెడ్లు ప్రత్యేకంగా ఎలాంటి సమావేశాలు లేకుండా ఉన్నా.. వారి లక్ష్యం ఒక్కటే. తమ తమ పార్టీలకు మేలు చేయడమే. ఇక, కాపులు కూడా అంతే. సో.. ఎవరో వచ్చి.. ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే పరిస్థితి నేడు ఏపీలో లేదన్నది వాస్తవం. తమ వర్గాన్ని రాజకీయంగా రక్షించుకునేందుకు.. తమదే పైచేయి చేసుకునేందుకు అనేక మంది నాయకులు ఈ కుల రాజకీయాలను కాపాడుతున్నారన్నది వాస్తవం. దీనిని పరిహరించకుండా.. పోలీసు ప్రయోగం చేస్తే.. అది మరింత ఇబ్బందే తప్ప.. సర్కారు ఆశించిన ప్రయోజనం అయితే ఇవ్వదు. సో.. మారాల్సింది.. పార్టీలే తప్ప.. కులాలు కాదు!.
