Begin typing your search above and press return to search.

మోత్కుపల్లిని వాడుకుని వదిలేశారా?

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీఆర్ఎస్ పావుగా ఉపయోగించుకుందా? ఇప్పుడు అవసరం లేదనుకుని వదిలేసిందా?

By:  Tupaki Desk   |   30 Sept 2023 5:00 PM IST
మోత్కుపల్లిని వాడుకుని వదిలేశారా?
X

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీఆర్ఎస్ పావుగా ఉపయోగించుకుందా? ఇప్పుడు అవసరం లేదనుకుని వదిలేసిందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ సీనియర్ నాయకుడు ఇప్పుడు బీఆర్ఎస్ ను వదిలేసి మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేయడమే అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2021 అక్టోబర్లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మోత్కుపల్లిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వెళ్లి బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదిపారు. దళిత బంధును ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించారు. ఎస్సీల ఓట్లు లక్ష్యంగా ప్లాన్ వేశారనే అభిప్రాయాలు అప్పుడు వ్యక్తమయ్యాయి. దీంతో పాటు బలమైన దళిత నాయకుడు మోత్కుపల్లిని కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. అంతే కాకుండా దళిత బంధు కమిషన్ ఏర్పాటు చేసి ఛైర్మన్ గా ఆయన్ని నియమిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆ ఎత్తుగడ ఫలించలేదు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ విజయాన్ని కేసీఆర్ అడ్డుకోలేకపోయారు.

ఆ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి.. కేసీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. అంబేడ్కర్ కు నిజమైన వారసుడు కేసీఆర్ అంటూ ఆకాశానికెత్తేశారు. కానీ ఆ తర్వాత పార్టీలో మోత్కుపల్లికి ప్రాధాన్యత లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసేందుకు మోత్కుపల్లి ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. అలాగే రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశించినా లాభం లేకుండా పోయింది. దీంతో బీఆర్ఎస్ ను వీడేందుకు మోత్కుపల్లి సిద్ధమయ్యారనే చెప్పాలి. తాజాగా కర్ణాటక వెళ్లి డీకే శివకుమార్ ను కలవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం పెరిగింది. బీఆర్ఎస్ లో చేరినప్పుడు రేవంత్ ది శనిపాదం అని తిట్టిన మోత్కుపల్లి.. ఇప్పుడు రేవంత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధమంటున్నారు. ఇదే రాజకీయ సిత్రమని విశ్లేషకులు అంటున్నారు.