'బొత్స' స్థానం కోసం వైసీపీలో పోటా పోటీ ..!
దీనిని బట్టి బొత్స సత్యనారాయణ కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగనున్నారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల అనంతరం.. ఆయనను ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి.
By: Garuda Media | 28 Feb 2026 8:00 PM ISTరాజకీయాల్లో తలపండిన నాయకుడు, అందరినీ కలుపుకొనిపోయే అజాత శత్రువుగా పేరొందిన బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన శాసన మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. గత ఏడాది.. ప్రస్తుతం కూడా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్కు గురై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కొలుకుంటున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పుడున్నట్టుగా ఆయన వ్యవహరించరాదని చెబుతున్నారు.
అంటే.. ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా ఆయన గళం వినిపిస్తున్నారు. కీలక అంశాలపై బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇదే.. ఆయన బ్రెయిన్ స్ట్రోక్కు గురి కావడానికి దారితీసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో ఆయన కొనసాగినా.. ఇకపై మండలిలో విపక్ష నాయకుడిగా ఉండేందుకు.. ఆయన సతీమణి ఝాన్నీ విముఖత వ్యక్తం చేశారు. ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆమె.. బొత్స పై స్ట్రెస్ పెరిగిందని.. ఇక, నుంచి ఆయనకు స్ట్రెస్ తగ్గించడమే తమ పని అని చెప్పుకొచ్చారు.
దీనిని బట్టి బొత్స సత్యనారాయణ కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగనున్నారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల అనంతరం.. ఆయనను ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బొత్స సీటును కైవసం చేసుకునేందుకు నలుగురు కీలక నాయకులు వైసీపీలో పోటీ పడుతున్నారు. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వరుదు కల్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మండలిలో బలమైన గళం వినిపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాధాన్యం ఇస్తారని ఆమె చెప్పుకొంటున్నారు.
ఈమెతో పాటు.. పార్టీ కీలక నాయకుడు, సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి సైతం నేను సైతం అంటున్నారు. పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపిస్తున్న లేళ్ల.. అధినేత జగన్కు నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నా రు. అలానే.. తలశిల రఘురాం కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈయన కూడా పార్టీలో కీలకంగానే ఉన్నారు. ఇక, పార్టీలో నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్న పీవీవీ సూర్యనారాయణ రాజు సైతం బొత్స సీటు కోసం తహతహ లాడుతున్నారు. మొత్తంగా ఈ సీటు ఖాళీ అయితే.. దక్కించుకునేందుకు నాయకులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
