Begin typing your search above and press return to search.

జనసేనకు హ్యాండిచ్చేశారు.. జీహెచ్ఎంసీలో బీజేపీ సింగిల్ ప్లేయర్ గేమ్..? వర్కవుట్ అవుతుందా?

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ “గ్రేటర్” డ్రామా షురూ అయింది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు.

By:  A.N.Kumar   |   19 May 2026 10:26 AM IST
జనసేనకు హ్యాండిచ్చేశారు..  జీహెచ్ఎంసీలో బీజేపీ సింగిల్ ప్లేయర్ గేమ్..? వర్కవుట్ అవుతుందా?
X

హైదరాబాద్ రాజకీయాల్లో మళ్లీ “గ్రేటర్” డ్రామా షురూ అయింది. ఎప్పట్నుంచో ఊరిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగకముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. పార్టీలన్నీ ఇప్పటికే క్యాలిక్యులేటర్లు.. కులాల మ్యాపులు, వాట్సాప్ వార్‌రూమ్‌లు దుమ్ముదులిపి బయటకు తీశాయి. అయితే ఈసారి అసలు ట్విస్ట్ ఏంటంటే... “మిత్రపక్షం” అనే పదానికి బీజేపీ సరికొత్త డెఫినిషన్ చెప్పబోతోందట.. నిన్నటిదాకా పక్కనే ఉండి మురిసిపోయిన జనసేనకు గట్టిగానే ‘హ్యాండ్’ ఇచ్చేలా ఉందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

‘దోస్తీ’ ముచ్చట ముగిసింది.. ఇక అంతా మనదే!

2020 గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని రీతిలో దూసుకొచ్చిన బీజేపీ, అప్పటినుంచి హైదరాబాద్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. “పాతబస్తీ నుంచి పటాన్‌చెరు వరకు కాషాయ జెండా” ఎగరేయాలనే కలతో ముందుకెళ్తోంది. ఇదే ఊపులో మొన్నటి అసెంబ్లీ.. నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భాగ్యనగరంలో తన ఓటు బ్యాంక్‌ను గట్టిగానే పెంచుకుంది. దీంతో ఈసారి జీహెచ్ఎంసీలో ఏపీలో కలిసిన కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రచ్చ లేపుతాయని.. సీట్ల పంపకాలు కూడా జరిగిపోతాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఆశపడ్డారు.

మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించగానే సోషల్ మీడియాలో “హైదరాబాద్‌లో కూటమి ప్రభంజనం” అంటూ పోస్టర్లు కూడా రెడీ అయిపోయాయి. కానీ బీజేపీ మైండ్ గేమ్ వేరేలా ఉంది. “ఆంధ్రాలో ఫ్రెండ్షిప్ ఓకే బ్రదర్... కానీ హైదరాబాద్ కార్పొరేషన్ మాత్రం మాదే!” అన్నట్టుగా లోపల స్క్రిప్ట్ మార్చేసిందట. తాజా పొలిటికల్ గుసగుసల ప్రకారం బీజేపీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘సింగిల్ ప్లేయర్’ గేమ్ ఆడాలని డిసైడ్ అయిందట.

త్యాగాల ‘తమ్ముడు’.. లెక్కల ‘అన్నయ్య’

ఈ వార్త జనసేనకు చిన్న షాక్ కాదు.. పెద్ద షాకే.. ఎందుకంటే 2020 గ్రేటర్ ఎన్నికల్లో అప్పటికే అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారానికి సిద్ధమైన జనసేన... బీజేపీ పెద్దల మాట కోసం లాస్ట్ మినిట్‌లో వెనక్కి తగ్గింది. “పెద్దన్న కోసం త్యాగం” మోడ్‌లో అప్పట్లో సైలెంట్ అయింది. కట్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రాలో కూటమి సూపర్ హిట్ అయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రేంజ్‌కు వెళ్లడంతో హైదరాబాద్‌లోనూ తమకు కనీసం ఓ పాతిక, ముప్పై సీట్లయినా ఇస్తారని జనసైనికులు లెక్కలు వేసుకున్నారు. కానీ ఇక్కడే కమలనాథులు తమ పక్కా కమర్షియల్ లెక్కలు బయటకు తీశారు.

"తెలంగాణలో మా ఓటు... మా సీటు... మా కార్పొరేటర్.. ఇక్కడ వేరే పార్టీలకు స్పేస్ ఇస్తే మా సొంత క్యాడర్ గుస్సా అవుతుంది. పైగా ఓట్లు చీలిపోతే లాభపడేది కాంగ్రెస్, బీఆర్ఎస్సే" అని బీజేపీ ఇంటర్నల్ మీటింగ్స్‌లో తేల్చేసిందట. అంటే జనసేన పరిస్థితి ఇప్పుడు “వచ్చిన వాడిని పంపించలేక.. పోయిన వాడిని ఆపలేక” అన్నట్టుగా తయారైంది.

పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఏంటి..?

ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న ఏమిటంటే... పవన్ కళ్యాణ్ ఈసారి కూడా “సర్దుకుపోదాం రా.. పెద్ద ల్యాండ్ స్కేప్‌లో ఆలోచించాలి” అంటూ సైలెంట్ అయిపోతారా? లేక “తెలంగాణలో జనసేన ఉనికి చాటాలంటే ఫైట్ తప్పదు బాస్!” అంటూ ఒంటరిగానే బరిలోకి దిగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన నిజంగానే ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. ఈ ముగ్గురు ఉద్దండుల మధ్య జనసేనకు మైక్ దొరుకుతుందా? లేక కేవలం సోషల్ మీడియా పోస్టర్లకే పరిమితం అవుతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఏదేమైనా గ్రేటర్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ హైదరాబాద్ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను మించిపోయేలా ఉన్నాయి. ఇక మిగిలింది ఒక్కటే... “కూటమి ఉందా? లేదా? జనసేనకు బీజేపీ సారీ చెప్పిందా?” అన్న సస్పెన్స్‌కు అధికారికంగా ఎండ్ కార్డ్ పడటం.. చూద్దాం.. భాగ్యనగర బాద్‌షా ఎవరో...