బీహార్ ఎలక్షన్స్.. 'ఒవైసీ' పైనే అన్ని కళ్లు!
బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి(బీజేపీ, జేడీయూ) పాలన సాగుతోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 4:00 AM ISTబీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి(బీజేపీ, జేడీయూ) పాలన సాగుతోంది. సీఎంగా నితీష్ కుమార్ ఉన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి(ఆర్జేడీ సహా ఇతర పక్షాలు) కూడా వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అయితే.. వీరి మధ్య ఇప్పుడు ఎంఐఎం పార్టీ వ్యవహారం చర్చగా మారింది.
గత ఎన్నికల్లోనూ ఎంఐఎం కీలక పాత్ర పోషించింది. అయితే.. ఇప్పుడు పరిస్థితిమారింది. వక్ఫ్ బోర్డు బిల్లు ను మెజారిటీ ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే.. పాస్ అయిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం బీహార్ ఎన్నికల్లో కనిపిస్తుందని.. దీనికి నేతృత్వం వహిస్తున్న ఎంఐఎం.. పార్టీకి మేలు జరు తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా సీమాంచల్(సుమారు 35 స్థానాలు) ప్రాంతంలో ఎంఐఎంకు మంచి పట్టుంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం దక్కించుకు న్నారు.
దీంతో ఎంఐఎంతో దోస్తీకి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. కానీ, దీనిని ఇండీ కూటమి మిత్రపక్షం ఆర్జేడీ విభేదిస్తోంది. ఎంఐఎంతో పొత్తు అవసరం లేదని.. ఆ పార్టీ బీజేపీకి బీ పార్టీ అని.. దానివల్ల కూటమికి నష్టం వస్తుందన్నది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చెబుతున్న మాట. ఇదిలావుంటే.. ఎంఐఎంను ఒంటరిగానే నడిపించేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మరో చర్చ సాగుతోంది. తద్వారా ప్రస్తుత ఎన్డీయే కూటమి సర్కారు వ్యతిరేక ఓటు బ్యాంకు.. చీలినా.. అది ఎంఐఎం ద్వారా తమకు మేలు చేస్తుందని అంటున్నారు.
ఇక, ఎంఐఎం విషయానికి వస్తే.. ఇండీ కూటమితో పొత్తుకు తమకు అభ్యంతరం లేదని.. కానీ, సీమాంచల్ మొత్తం తమకే కేటాయించాలని అసదుద్దీన్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ.. తమను కూటమిలో చేర్చు కోక పోతే.. పూర్తిగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ఆయన చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇండీ కూటమిలో చేర్చుకుంటే.. సీమాంచల్ నియోజకవర్గా లన్నీ.. ఆపార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. పైగా ఆర్జేడీ ఒప్పుకోవడం లేదు. అలాగని వదిలేస్తే.. ప్రభుత్వ వ్యతి రేక ఓటు బ్యాంకు చీలి తమకు నష్టం కలిగిస్తుంది. ఈ వ్యవహారంపైనే కాంగ్రెస్ తలపట్టుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
