గ్యాస్ దెబ్బకు బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి వంటగదిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి.
By: Sivaji Kontham | 9 March 2026 11:38 PM ISTపశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న గల్ఫ్ యుద్ధ మేఘాలు భారతీయ సామాన్యుడి వంటగదిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా సిలికాన్ సిటీ బెంగళూరులో గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమ కుప్పకూలే పరిస్థితికి చేరుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే కుకింగ్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో రేపటి నుండి నగరంలోని రెస్టారెంట్లు, హోటళ్లు తమ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సంచలన ప్రకటన చేసింది.
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా చమురు, సహజ వాయువు సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. దీని ప్రభావంతో భారత్కు వచ్చే గ్యాస్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. వాణిజ్య సిలిండర్ల లభ్యత మార్కెట్లో దాదాపు శూన్యమవడంతో.. హోటల్ నిర్వాహకులు వంటలు వండలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. నిత్యం వేలాది మందికి ఆహారాన్ని అందించే ఈ రంగం ఇప్పుడు `గ్యాస్ దెబ్బ`కు విలవిలలాడుతోంది.
బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రేపటి నుండి హోటళ్లు మూతపడటం వల్ల నగరంలోని లక్షలాది మంది బ్యాచిలర్లు, ఐటీ ఉద్యోగులు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గాలు లేక రెస్టారెంట్లను నడపడం అసాధ్యమని వారు స్పష్టం చేశారు. ఇది కేవలం వ్యాపారానికే కాకుండా, ప్రజల ప్రాథమిక ఆహార అవసరాలకు కూడా పెద్ద ఆటంకంగా మారింది.
యుద్ధం కారణంగా సముద్ర మార్గాల్లో రవాణా నిలిచిపోవడం.. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరల పెరుగుదలతో సతమతమవుతున్న హోటల్ యజమానులు, ఇప్పుడు అసలు గ్యాస్ దొరకకపోవడంతో చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ జోక్యం చేసుకుని తక్షణమే గ్యాస్ నిల్వలను విడుదల చేయకపోతే ఈ ప్రభావం ఇతర నగరాలకు కూడా పాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
హోటళ్ల బంద్ నిర్ణయంతో వాటిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులు, సప్లయర్లు , డెలివరీ బాయ్స్ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో హోటల్ వ్యవస్థ ఆగిపోతే అది ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. గల్ఫ్ యుద్ధం ముగిసే వరకు లేదా సరఫరా పునరుద్ధరించబడే వరకు ఈ అనిశ్చితి కొనసాగేలా కనిపిస్తోంది.
ప్రస్తుతానికి బెంగళూరులో మొదలైన ఈ గ్యాస్ సంక్షోభం మునుముందు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లోని ఫుడ్ ఇండస్ట్రీని ఎలా ప్రభావితం చేస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని, గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరిస్తేనే హోటళ్లు మళ్లీ తెరుచుకునే అవకాశం ఉంది. అంతవరకు నగర ప్రజలకు బయట భోజనం దొరకడం కష్టతరమే కానుంది.
