Begin typing your search above and press return to search.

పాన్ షాప్ దగ్గర భుజం తగలటంతో గొడవ మొదలై చంపేశారు

హైదరాబాద్ మహానగరంలో తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   4 April 2024 8:30 AM GMT
పాన్ షాప్ దగ్గర భుజం తగలటంతో గొడవ మొదలై చంపేశారు
X

చిన్న విషయాలకు కొందరు రియాక్టు అవుతున్న తీరు చూస్తే నోట మాట రాదంతే. హైదరాబాద్ మహానగరంలో తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఒక కుర్రాడు పాప్ షాప్ దగ్గర మరో కుర్రాడి భుజం తగిలటంతో మొదలైన వాదులాట గొడవగా మారి.. చివరకు స్నేహితులతో కలిసి ఆ కుర్రాడ్ని చంపేసిన వైనం చూసినప్పుడు నోట మాట రాదంతే. అసలేం జరిగిందంటే..

బేగంపేటలోని అంబేడ్కర్ నగర్ లో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ అరాచక ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. బేగంపేటకు చెందిన 18 ఏళ్ల తరుణ్ ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటల వేళలో ఒక పాన్ షాప్ కు వెళ్లాడు. ఆ టైంలో అక్కడే ఉన్న ఒక కుర్రాడి భుజం తరుణ్ కు తగిలింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

అది కాస్తా పెద్దది కావటంతో.. ఆ యువకుడు తన రూంలో ఉన్న మరో ముగ్గురిని ఘటనా స్థలానికి పిలుచుకొని వచ్చాడు. వారు కూడా తరుణ్ తో గొడవపడ్డారు. అది కాస్తా ఘర్షణగా మారింది. దీంతొ నలుగురు మళ్లీ తమ రూంకు వెళ్లి కత్తుల్ని వెంట తెచ్చుకున్నారు. తరుణ్ కడుపులో పొడిచి పరారయ్యారు. కత్తి పోట్లతో కుప్పకూలిన తరుణ్ కు సంబంధించిన సమాచారాన్ని అతడి తల్లి యాదమ్మకు ఇచ్చారు.

అప్పటికే రక్తం మడుగులో ఉన్న కొడుకును తీసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల శివశంకర్.. 21 ఏళ్ల తరుణ్.. జహీరాబాద్ కు చెందిన 22 ఏళ్ల పండు.. 21 ఏళ్ల సాయికిరణ్ లు ఈ దారుణానికి కారణమని తేల్చారు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన వారు ఏప్రిల్ ఒకటో తేదీనే అంబేడ్కర్ నగర్ లోని గదిని అద్దెకు తీసుకున్నట్లుగా గుర్తించారు. నిందితుల్లో సాయి కిరణ్ మొదట తరుణ్ తో గొడవపడటం.. మిగిలిన ముగ్గుర్నీ పిలుచుకురావటంతో గొడవ పెద్దదై.. హత్య వరకు వెళ్లింది. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.