అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. రెండు నెలల్లో రెండోసారి.. ఏంటీ కథ?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. ఇది రెండు నెలల వ్యవధిలో ఆయన రెండవ యుఎస్ పర్యటన కావడం గమనార్హం.
By: A.N.Kumar | 7 Aug 2025 4:45 PM ISTపాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. ఇది రెండు నెలల వ్యవధిలో ఆయన రెండవ యుఎస్ పర్యటన కావడం గమనార్హం. ఈసారి ఆయన యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ కమాండర్ (CENTCOM) చీఫ్ జనరల్ మైకేల్ కురిల్లా వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకానున్నారు.
అమెరికా మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలను పర్యవేక్షించిన కురిల్లా, పాక్ను "అద్భుత భాగస్వామి"గా ప్రశంసించారు. ఇటీవల ఐసిస్-ఖోరాసాన్ ఉగ్రవాదులను పాక్ పట్టుకున్నందుకు అమెరికా ఇచ్చిన ఇంటెలిజెన్స్పై ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ నేపధ్యంలో ఆయన పాకిస్తాన్ పర్యటన సందర్భంగా "నిషాన్-ఎ-ఇమ్తియాజ్" అవార్డుతో సత్కరించారు.
- భారత్ అసహనం
జనరల్ కురిల్లా వ్యాఖ్యలు అమెరికా – పాక్ మధ్య పెరుగుతున్న సైనిక సంబంధాలు భారత్లో అసంతృప్తిని కలిగించాయి. ఉగ్రవాదానికి భారత్ ఎదురుగా పోరాటం చేస్తుంటే, పాక్ను ప్రశంసిస్తూ అమెరికా ఓవర్టోన్ ఇవ్వడం పట్ల భారత్ వ్యతిరేకంగా స్పందించింది.
- ట్రంప్–ఆసిమ్ మునీర్ భేటీ.. విశ్వ రాజకీయాలలో కొత్త మలుపు?
జూన్లో ఆసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇది ఒక మైలురాయి సమావేశంగా గుర్తించబడింది, ఎందుకంటే ఒక అమెరికా అధ్యక్షుడు అది కూడా ఎలాంటి ప్రభుత్వ అధికారుల మద్దతు లేకుండా ఒక పాక్ ఆర్మీ చీఫ్ను ప్రత్యక్షంగా లంచ్కు ఆహ్వానించడం ఇదే తొలిసారి.
ఈ భేటీ భారత్ – పాక్ మధ్య మే నెలలో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో చోటు చేసుకుంది. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ పబ్లిక్గా ఆసిమ్ మునీర్ను ప్రశంసించారు. "ఆయన యుద్ధానికి పోకుండా సంయమనం పాటించడం వల్లే నేను ఆయనను కలిసాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
-ట్రంప్కు నోబెల్ నామినేషన్ – పాకిస్తాన్ ఔదార్యం
ఈ భేటీ తర్వాత ఆసిమ్ మునీర్ ట్రంప్ను "యుద్ధ నివారణ సాయానికి" నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. వెంటనే పాక్ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్ను నామినేట్ చేసింది. ట్రంప్ను మెప్పించేందుకు పాక్ చేస్తున్న రాజకీయ వ్యూహాలు ఆసక్తికరంగా మారాయి.
ఇవన్నీ చూస్తుంటే పాక్-అమెరికా మధ్య సైనిక సంబంధాలు తిరిగి పెరుగుతున్నాయన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పాక్ తన పాత వ్యూహాలను కొనసాగిస్తూ అమెరికా మద్దతును పొందేందుకు కృషి చేస్తోంది. కానీ ఇదంతా భారత్ –అమెరికా సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాల్సిందే.
