పాక్ కొంప ముంచిన యుద్ధ పిపాసీ..ఎక్కడ దాక్కున్నావ్ ?
ఈయన విద్వేషం నరాలకు ఎక్కించుకున్న ఉగ్రవాదులు మతం అడిగి మరీ పాతిక మంది దాకా చంపారు అంటే అసీమ్ మునీర్ ఎంతటి ప్రమాదకారి అన్నది అర్ధం అవుతుంది.
By: Tupaki Desk | 9 May 2025 3:27 PMపాకిస్థాన్ లో పేరుకే ప్రజాస్వామ్యం అన్నది అందరికీ తెలిసిందే. అక్కడ ప్రపంచాన్ని నమ్మించడానికి అన్నట్లుగా ఒక ప్రభుత్వం కనిపిస్తుంది. ప్రధానమంత్రి మంత్రులు ఇలా ఉంటారు. అయితే వీరంతా సైన్యం చెప్పినట్లుగా ఆడాల్సిందే. పాక్ లో పవర్ ఫుల్ ఎవరు అంటే ఆర్మీయే అని అంటారు. ఆ ఆర్మీకి చీఫ్ అయిన వారు ఏకంగా దేశాన్ని శాసిస్తారు.
వారే ఉగ్ర క్యాంపులకు ప్రోత్సాహం ఇస్తూంటారు. ఇదిలా ఉంటే గత ఏడున్నర దశాబ్దాల చరిత్ర తీసుకుంటే పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వారు అంతా భారత్ మీద విషం కక్కిన వారే. కుళ్ళూ కుట్రలతో రగిలిపోయిన వారే. ఇపుడు వారందరినీ తలదన్నే ఆర్మీ చీఫ్ గా ఆయన వచ్చారు. పేరు అసీమ్ మునీర్. ఈయన గారి నరనరాలలో భారత్ పట్ల ఆక్రోశం ఉంటుంది భారత్ ని దెబ్బతీయాలని ఈయన సదా రగిలిపోతూంటాడు.
అందుకే ఆయన ఏప్రిల్ 17న కాశ్మీరీలకు ఎప్పటికీ తాము తోడుగా ఉంటామని చెబుతూ భారత్ మీద విషం కక్కాడు. హిందువులు ముస్లిములు వేరు అని దారుణంగా మాట్లాడాడు. ఆ తరువాత ఏప్రిల్ 22న పహల్గాం లో ఉగ్ర దాడి జరిగింది. అంటే అంతా ఈయన గారి స్కెచ్ అనే అంటున్నారు. ఇక అసీమ్ మునీర్ గురించి చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఆయన కరడు కట్టిన మతోన్మాదిగా చెబుతున్నారు. ఈయన పూర్వీకుల మూలాలు భారత్ లో ఉండడం విశేషం. 1947లో దేశ విభజన జరిగిన తరువాత ఈయన తల్లిదండ్రులు పంజాబ్ లోని జలంధర్ నుంచి పాకిస్థాన్ లోని రావల్పిండికి వెళ్ళారు. అలా పాక్ లో స్థిరపడ్డారు. ఇక అసీమ్ మునీర్ తండ్రి సయ్యద్ సర్వర్ మునీర్ షా అక్కడ ఒక మదర్సా లో టీచర్ గా పనిచేసేవాడు. పాక్ గడ్డ మీదనే అసీమ్ మునీర్ పుట్టాడు. తండ్రి పనిచేసీ మదర్సాలో అతను చదువుకున్నాడు.
ఈయనకు రాజకీయ నేతలతో విపరీతమైన పరిచయాలు ఉన్నాయి. అందుకే పాక్ ఆర్మీ చీఫ్ పదవికి పాక్ మిలటరీ అకాడమీ శిక్షణ లేకుండా కేవలం ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుంచి తీసుకున్న తర్ఫీదుతో ఆ పదవిలోకి వచ్చేశాడు. ఇలా 1986లో తన మిలటరీ కెరీర్ ని ప్రారంభించిన అసీమ్ మునీర్ 2014 నాటికి ఆర్మీలో మేజర్ జనరల్ గా ప్రమోషన్ పొందాడు. ఆ మీదట పాక్ ఆర్మీ చీఫ్ అయ్యాడు.
ఈయనకు ఎవరికీ లేని ఒక రికార్డు ఉంది. పాక్ లోని నిఘా సంస్థలు అయిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ , మిలటరీ ఇంటెలిజెన్స్ కు చీఫ్ గా పనిచేసి ఆర్మీ చీఫ్ అయిన ఏకైక వ్యక్తి ఈ అసీమ్ మునీర్. దాంతో ఆయనకు భారత్ విద్వేషం ఇంకా పెరిగిపోయింది.
ఈయనకు సైన్యమే మతంగా ఉండేది జీహాదీ ఆర్మీ చీఫ్ గా పేరు మోశాడు. జీహాదీ చేస్తున్నామని పాక్ ని ఏ శక్తి ప్రపంచంలో ఒక్క అడుగు కూడా వెనక్కి నెట్టలేదు అని ఎన్నో కబుర్లు చెబుతూ భారత్ మీదనే టార్గెట్ చేస్తూ వచ్చినది ఈ అసీమ్ మునీర్.
ఈయన రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఇమ్రాన్ ఖాన్ ని గద్దె దినడంతో ఈయన పాత్ర చాలా కీలకంగా ఉంది అని అంటారు. అంతే కాదు ఇమ్రాన్ పార్టీని దగ్గరుండి బ్యాన్ చేయించారు అని అంటారు. ఈయన భారత్ విద్వేషం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2019లో ఈయన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నపుడే పుల్వామా దాడులు జరిగాయి. ఆనాటి దాడి వెనక ప్రధాన సూత్రధారిగా ఉన్న అసీమ్ మునీర్ ఇపుడు దగ్గరుండి మరీ పహల్గాం దాడికి స్కెచ్ గీశారు అని అంటున్నారు
ఈయన విద్వేషం నరాలకు ఎక్కించుకున్న ఉగ్రవాదులు మతం అడిగి మరీ పాతిక మంది దాకా చంపారు అంటే అసీమ్ మునీర్ ఎంతటి ప్రమాదకారి అన్నది అర్ధం అవుతుంది. ఇలా పాక్ కొంప ముంచి యుద్ధం చిచ్చు పెట్టిన ఈ పెద్ద మనిషి యుద్ధం మొదలైన తరువాత ఎక్కడా కనిపించడం లేదు అని అంటున్నారు. మరో వైపు ఈయన ఆర్మీ చీఫ్ పదవి పోయిందని అరెస్ట్ చేశారని ప్రచారం సాగుతోంది. ఇంతటి మతోన్మాదిని యుద్ధ ఉన్మాదిని కోరి మరీ నెత్తికెక్కించుకున్నందుకు పాక్ ఇంతకు ఇంత భారీ మూల్యం చెల్లించుకుంటోందని ఇస్తోంది అని అంటున్నారు.