బాబు విజనేంటో నాకు బాగా తెలుసు: పనగాడియా ప్రశంస
ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రశంసలు, పొగడ్తలు పెరుగుతున్నాయి.
By: Tupaki Desk | 17 April 2025 1:02 PM ISTఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రశంసలు, పొగడ్తలు పెరుగుతున్నాయి. రాష్ట్రాన్ని సందర్శించిన వారు.. సందర్శించ కుండానే విషయాలు తెలుసుకున్నవారు కూడా.. చంద్రబాబును పొగుడుతున్నారు. ఆయన పాలనను మెచ్చుకుంటున్నారు. అయితే.. ప్రశంసలు.. పొగడ్తలు కామనే అయినా.. ఆశించిన వారి నుంచి.. అవి వస్తే.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆ ఆనందంలోనే మునిగిపోయారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగడియా.. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.
అరవింద్ పనగడియా వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త నోటి నుంచి చంద్రబాబుకు ప్రశంసలు రావడం అంటే అంత తేలిక విష యం కాదు. ఇదే బాబులో ఆనందాన్ని రెట్టింపు చేసింది. చంద్రబాబు విజన్ గురించితనకు ఎప్పుడో తెలుసునని పనగాడియా వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్లో ఇద్దరం కలిసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. బాబు విజన్కు అప్పుడే తాను ముగ్ధుడినయ్యానని పనగాడియా వివరించారు. ``మనం రేపటి గురించి ఆలోచిస్తాం. చంద్రబాబు వచ్చే కొన్నాళ్ల గురించి స్వప్నిస్తారు`` అని అన్నారు.
అంతేకాదు.. నీతి ఆయోగ్లో తాను పనిచేస్తున్నప్పుడు..చంద్రబాబుతో కలిసి అనేక విషయాలు పంచుకున్నానని.. ఆయన ఆలోచనా దృక్ఫథం.. ముందు చూపు వంటివి తనను ఎంతో ఆకట్టుకున్నాయని చెప్పారు. 2047 విజన్ కోసం తపిస్తున్న చంద్రబాబు స్వప్నం సాకారం కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు ఒక రోడ్ మ్యాప్ను రెడీ చేసుకున్నారని.. అది సక్సెస్ కావాలని అన్నారు. ఇక, ప్రత్యేక హోదా విషయాన్ని వదిలేయాలని పనగాడియా సూచించారు. ఇప్పుడు ఏరాష్ట్రానికి ఇవ్వడం లేదన్నారు. కేంద్ర పన్నుల ఆదాయాన్ని రాష్ట్రాలకు ఎలా పంచాలనే దానిపై నిర్ణయిస్తామని.. చెప్పారు.
భారీ డిన్నర్
16వ ఆర్దిక సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాతీరాన హరిత హోటల్, బెర్మ్ పార్క్లో మర్యాదపూర్వక విందు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రఖ్యాతి పొందిన గిరిజన హస్తకళల ప్రదర్శన స్టాళ్ళను ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. సృజనాత్మకతకు అద్దంపట్టే విధంగా హస్తకళ కళాకారులు ప్రదర్శించిన చేనేత మగ్గం, జముకు వాయిద్యం వంటి సంప్రదాయ వస్తువులు, తోలు బొమ్మలాట వంటి కళాకృతులు, ప్రదర్శనల వైవిధ్యాన్ని, వాటి ప్రత్యేకతల గురించి అతిధులైన ఆర్థిక సంఘం చైర్మన్, ఇతర సభ్యులకు ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ గారు తెలియజేశారు.
