Begin typing your search above and press return to search.

ఆ రెండే ప్రచారాస్త్రాలా ?

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ను నోరెత్తనీయకుండా చేయటంలో భాగంగానే మంత్రులు పదేపదే ఇరిగేషన్ శాఖలో జరిగిన భారీ అవినీతిని ప్రస్తావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jan 2024 2:30 AM GMT
ఆ రెండే ప్రచారాస్త్రాలా ?
X

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలను రెడీ చేసుకుంటోంది. అస్త్రాలు ఎన్నున్నా కీలకమైన రెండింటిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట పార్టీ. అదేమిటంటే కాళేశ్వరం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి. ధరణిపోర్టల్లో జరిగిన భూ దోపిడీ. ఈ రెండు అంశాలపైనే కేసీయార్, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఫోకస్ చేయాలని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ను నోరెత్తనీయకుండా చేయటంలో భాగంగానే మంత్రులు పదేపదే ఇరిగేషన్ శాఖలో జరిగిన భారీ అవినీతిని ప్రస్తావిస్తున్నారు.

కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్టని, మేడిగడ్డలో విపరీతమైన అవినీతి జరిగటంతో పాటు నాణ్యత బాగా నాసిరకంగా ఉందని రేవంత్ అండ్ కో పదేపదే జనాలకు చెబుతున్నారు. నాసిరకం నాణ్యత కాబట్టే పిల్లర్లు కుంగిన విషయాన్ని రేవంత్ ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. పిల్లర్లు కుంగటాన్ని నాణ్యతా లోపంగా ఇప్పటికే నిపుణులు కూడా తేల్చిచెప్పారు. దాంతో వేరే దారిలేక కేటీయార్ కూడా నిర్మాణంలో చిన్నచిన్న లోపాలుండటమే సహజమే అని అంగీకరించారు. రాబోయే ఎన్నికల్లో కేటీయార్ అంగీకారాన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు అవినీతిని కూడా బాగా హైలైట్ చేయబోతున్నది కాంగ్రెస్. ఇలాంటి అనేక పథకాల్లో అవినీతిని లెక్కబెడుతున్నారు. అలాగే థరణి పోర్టల్లో జరిగిన అవకతవకలను కూడా చూస్తున్నారు. వేలాది ఎకరాలను అక్రమార్కులకు ధరణి పోర్టల్ ద్వారా కేసీయార్ ప్రభుత్వం కట్టబెట్టిన వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

పోర్టల్ ను అడ్డుపెట్టుకుని లాభపడిన వాళ్ళ వివరాలను గ్రౌండ్ లెవల్లో విచారణ చేయిస్తోంది. ఒకవైపేమో గ్రామాల్లో వేలాదిమంది భూయజమనాలు పోర్టల్ ద్వారా నానా ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో అధికారపార్టీలో పట్టున్న కొందరు వేలాది ఎకరాలను పోర్టల్ ను అడ్డుపెట్టుకుని సొంతం చేసుకున్నారనే విషయం బయటపడింది. కాబట్టి అనేక అంశాలను ప్రస్తావిస్తునే ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి, ధరణిపోర్టల్ అవకతవకలపై ఎక్కువగా దృష్టిపెట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. కేసీయార్ కు గట్టిగా సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వకూడదన్నది రేవంత్ ఉద్దేశ్యం. మరి చివరకు ఏమిజరుగుతుందో చూడాలి.