Begin typing your search above and press return to search.

ఇదే కదా చంద్రబాబు అంటే... అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు

అదేవిధంగా అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గౌరవాన్ని పొందింది. ఇది స్థిరమైన వ్యవసాయం, ఆర్గానిక్ పద్ధతులకు చిహ్నంగా నిలిచింది.

By:  Tupaki Political Desk   |   29 Sept 2025 12:51 AM IST
ఇదే కదా చంద్రబాబు అంటే... అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు
X

అరకు కాఫీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆదివాసీలు పండించే కాఫీ అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నుంచి అరకు కాఫీకి బ్రాండింగ్ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు కాఫీకి ‘ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ - 2025’ అవార్డు లభించింది. ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో గిరిజన కార్పొరేషన్ (జీసీసీ) అరకు వ్యాలీ కాఫీకి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. గిరిజనుల జీవనోపాధిని మార్చి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు ఈ అవార్డును అందజేశారు. అరకు కాఫీ భారతీయ కాఫీ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తోంది.

అరకు కాఫీకి గతంలోనూ అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. 2018లో పారిస్ లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూర్స్ డిఎల్ ఎపిసెరీ ఫైన్ అవార్డుల్లో ఎపిక్యూర్ డి‘ఓర్ గోల్డ్’ మెడల్ దక్కించుకుంది. ఇది భారతదేశం నుంచి మొదటి స్పెషాలిటీ కాఫీకి లభించిన అంతర్జాతీయ గుర్తింపు. అదే ఏడాది ఉత్తమ కాఫీ పాడ్ కు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. 2023లో ఐదో వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ లో మొదటి అవార్డు దక్కింది. ఇది 12 ఏళ్లలో మొదటిసారి. ఇతర గుర్తింపుల్లో గ్రాండ్ మాస్టర్స్ క్లబ్, మాస్టర్ కాఫీ క్లబ్ వంటివి ఉన్నాయి. మొత్తంగా 4-5 ప్రధాన అవార్డులు, జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్, జీ20 సమ్మిట్ లో ప్రదర్శన వంటి గుర్తింపులు దక్కాయి. ఈ అవార్డులు అరకు కాఫీని ప్రపంచ స్థాయి బ్రాండ్ గా మార్చాయి.

అదేవిధంగా అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప గౌరవాన్ని పొందింది. ఇది స్థిరమైన వ్యవసాయం, ఆర్గానిక్ పద్ధతులకు చిహ్నంగా నిలిచింది. పారిస్, న్యూయార్క్, టోక్కోలో లగ్జరీ కాఫీ షాపులు, గౌర్మెట్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఇటలీ, బెల్జియం, రష్యా వంటి దేశాలకు ఎగుమతి అవుతోంది. ప్రపంచ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇది భారత కాఫీ ఎగుమతులలో కీలక పాత్ర పోషిస్తోంది. జీ20 సమ్మిట్ లో బహుమతిగా ఇవ్వడం దీని ప్రపంచ గుర్తింపును పెంచింది. అరకు కాఫీ భారతీయ ఆర్గానిక్ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ లో డిమాండ్ పెరగడానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇది గిరిజనుల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహిస్తోంది.

అరకు కాఫీ విశాఖ ఏజెన్సీలోని తూర్పు కనుమల్లో పండిస్తారు. ఇది 900-1100 మీటర్ల ఎత్తులో ఆరబికా రకం కాఫీని సాగు చేస్తారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. గిరిజన రైతులు అర్గానిక్ పద్దతులతో సాగు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఇక ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. ఇది శుభపరిణామమని గిరిజన రైతుల కృషితో బలమైన సామాజిక స్థానం సాధ్యమైందని, సోషల్‌ మీడియా వేదికగా జీసీసీకి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. 2025 మార్చిలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, 100 పైలట్ అవుట్ లెట్లు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామం, పట్టణంలో విస్తరించాలని చెప్పారు. ఆగస్టు 2025లో కాఫీ తోటలు సందర్శంచి, ప్రకృతి మధ్య తాగిన అనుభవాన్ని ట్వీట్ చేశారు.