ఈసారి దసరా జగన్ దే...?
విజయదశమి అంటే విజయానికి చిహ్నం. ఇది రాజకీయ నాయకులు నమ్మే అసలైన సెంటిమెంట్.
By: Tupaki Desk | 9 Oct 2023 8:00 AM ISTవిజయదశమి అంటే విజయానికి చిహ్నం. ఇది రాజకీయ నాయకులు నమ్మే అసలైన సెంటిమెంట్. అందుకే విజయదశమి వేళ వారు తమ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని స్టార్ట్ చేస్తారు. తమ భవిష్యత్తు ప్రణాళికలను కూడా చక్కగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. గత ఏడాది విజయదశమి అంటే 2022 లో కేసీయార్ ఈ చాన్స్ తీసుకున్నారు.
ఆయన తన ప్రాంతీయ పార్టీ టీయారెస్ ని భారత్ రాష్ట్ర సమితి బీయారెస్ గా మార్చారు. అలా జాతీయ పార్టీగా దానికి ఒక బిగ్ కలర్ ఇచ్చారు. ఏడాది కాలంలో బీయారెస్ జాతీయ పార్టీగానే సాగుతోంది. 2024లో బీయారెస్ పెర్ఫార్మెన్స్ ఏంటి అన్నది రుజువు అవుతుంది.
ఇదిలా ఉంటే విజయదశమి మీద గత మూడు ఏళ్లుగా కన్నేస్తూ వచ్చిన వారు వైఎస్ జగన్. ఆయన ప్రతీ దసరా వేళ కూడా విశాఖ నుంచి పాలన చేయాలనుకుని గట్టిగా భావించేవారు. కానీ అది జరిగేది కాదు, ఏదో విధంగా 2020, 2021, 2022లలో వాయిదా పడుతూ వస్తోంది.
ఇక ఈ ఏడాది అంటే 2023 విజయదశమి తనదే అని జగన్ అంటున్నారు. ఆయన తన మూడేళ్ళ కోరికను అలా తీర్చుకోబోతున్నారు. విశాఖ నుంచి పాలన సాగించబోతున్నారు. ఈ నెల 23న జగన్ విశాఖలో మకాం మొదలెట్టబోతున్నారు. అదే రోజున ఆయన క్యాంప్ ఆఫీస్ కూడా ఓపెన్ అవుతోంది.
ఈ రకంగా చూస్తే మాత్రం జగన్ ఈ దసరా తనదే అని గట్టిగా చాటి చెప్పబోతున్నారు. మరో వైపు చూస్తే దసరా తనకు అన్ని విధాలుగా కలసి వచ్చి 2024 ఎన్నికలలో మరోమారు అధికార పీఠాన్ని అందిస్తుంది అన్నది జగన్ మార్క్ ఆలోచన.
ఇక తెలుగుదేశం పార్టీ కూడా దసరా సెంటిమెంట్ తో ముందుకు పోతోంది. 2021లో విజయదశమి వేళ ఏపీ టీడీపీకి కొత్త కార్యవర్గాన్ని చంద్రబాబు ప్రకటించారు. ఉత్తరాంధ్రాకు చెందిన బీసీ నేత అచ్చెన్నాయుడుని ప్రెసిడెంట్ గా చేస్తూ కొత్త రాజకీయ సామాజిక సమీకరణలకు తెర తీశారు.
ఇక ఈ దసరాకు కూడా చంద్రబాబు చాలా ముందుగానే అజెండాను సెట్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తి ఎన్నికల ప్రణాళికను దసరాకు రిలీజ్ చేయాలన్నది బాబు ఆలోచన. దానికి తగిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్న వేళ బాబు బిజీ జీవితంలో అరెస్ట్ పర్వం ఎదురైంది.
దాంతో చంద్రబాబు ఇపుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. ఒక వేళ ఆయనకు కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చి బయటకు వచ్చినా ఇంత తక్కువ టైం లో ఆయన ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేయరనే అంటున్నారు. సో ఎన్నికల ముందు విజయాలాను అందించే దసరా వేళ తెలుగుదేశానికి ఏ మాత్రం చాన్స్ దక్కేటట్లు కనిపించడంలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి దసరా ఈసారి సరదా రెండూ వైఏస్ జగన్ వే అంటున్నారు.
ఆయన విశాఖ నుంచి పాలన మొదలెట్టి తూర్పు నుంచి శుభారంభం చేయనున్నారు. ఇటు నుంచి అంటు వైపు అంటే ఉత్తర కోస్తా నుంచి రాయాలసీమ వైపుగా వైసీపీకి పాజిటివ్ వేవ్ తీసుకుని రావడం ద్వారా ఢంకా భజాయించాలని అనుకుంటున్నారు. సో అలా ఈసారి దసరా వైసీపీకి ఫుల్ హ్యాపీ ఇస్తుందనే అంటున్నారు.
