Begin typing your search above and press return to search.

వైసీపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి!

అయితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంతో ఏపీలోనూ విస్తరించాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలకు పెద్ద గండిపడింది. దీంతో ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు పక్క చూపులు చూస్తున్నారని సమాచారం.

By:  Tupaki Desk   |   20 Jan 2024 9:55 AM IST
వైసీపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి!
X

తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ లోనూ బీఆర్‌ఎస్‌ ను విస్తరించాలని కేసీఆర్‌ పెద్ద కలలే కన్నారు. ఏపీలో కేసీఆర్‌ పాలన మాకు కావాలని.. బీఆర్‌ఎస్‌ ఏపీలోనూ పోటీ చేయాలని గతంలో ఒకటి రెండు చోట్ల ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. ఇందుకు తగ్గట్టే ఏపీకి చెందిన కొంతమంది ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్స్‌ బీఆర్‌ఎస్‌ లో చేరారు. ఇలాంటివారిలో మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ వంటివారు ఉన్నారు.

అయితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలు కావడంతో ఏపీలోనూ విస్తరించాలన్న బీఆర్‌ఎస్‌ ఆశలకు పెద్ద గండిపడింది. దీంతో ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు పక్క చూపులు చూస్తున్నారని సమాచారం. బీఆర్‌ఎస్‌ లోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందన్న భయంతోనే వేరే పార్టీల్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ కోవలో బీఆర్‌ఎస్‌ నేత రావెల కిశోర్‌ బాబు ఉన్నారని టాక్‌ నడుస్తోంది. ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో జంపింగ్‌ జపాంగులు చోటు చేసుకుంటున్నాయి. ఆలస్యమయితే సీటు దక్కే అవకాశం ఉండకపోవడంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

ఈ క్రమంలో మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు పేరు కూడా వినిపిస్తోంది. కేసీఆర్‌.. రావెలను బీఆర్‌ఎస్‌ జాతీయ వ్యవహారాల ఇంచార్జిగా నియమించారు. అయితే బీఆర్‌ఎస్‌ కు ఇప్పటివరకు ఆంధ్రాలోనే అతీగతీ లేకపోవడంతో రావెల మళ్లీ పక్క చూపులు చూస్తున్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.

ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన రావెల కిశోర్‌ బాబు 2014లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితను ఓడించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో రావెల కిశోర్‌ బాబు పనిచేశారు. అయితే ఆయన కుమారుడి వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదం కావడం, ఇందుకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో చంద్రబాబు ఆయనను పదవి నుంచి తప్పించారు.

ఇక 2019 ఎన్నికల నాటికి రావెల కిశోర్‌ బాబు జనసేన పార్టీలో చేరారు. మళ్లీ ప్రత్తిపాడు నుంచే జనసేన పార్టీ అభ్యర్థిగా మేకతోటి సుచరితపై పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది కాలానికే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అయితే అక్కడ కూడా కుదురుగా ఉండలేకపోయారు.

ఆ తర్వాత విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ తో కలిసి కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు. చివరి శ్వాస వరకు కేసీఆర్‌ తోనే ఉంటానని తెలిపారు. బీఆర్‌ఎస్‌ లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

అలాంటి రావెల కిశోర్‌ బాబు కూడా గతంలో గుంటూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నేతలెవరూ హాజరు కాలేదు. తోట చంద్రశేఖరే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ నేతలు రాకపోయినా కనీసం స్థానిక నేతే అయినా మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు రాకపోవడంపై పెద్ద ఎత్తునే చర్చ జరిగింది.

ఇప్పుడు ఇక రావెల్‌ కిశోర్‌ బాబు బీఆర్‌ఎస్‌ కు గుడ్‌ బై కొట్టి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని అంటున్నారు. లేదా కాంగ్రెస్‌ పార్టీలో చేరొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇలా అన్ని పార్టీలను కవర్‌ చేశారు. ఇక మిగిలింది.. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలే. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానిలో రావెల కిశోర్‌ బాబు చేరొచ్చని టాక్‌ నడుస్తోంది.