విదేశాల్లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు.. అక్కడ తింగరి వేషాలు!
తాజాగా జనసేన జెండాతో ఓ అభిమాని హంగామా చేయడానికి ప్రయత్నిస్తే, తీరని అవమానం ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
By: Tupaki Desk | 19 May 2025 4:22 AMపిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. ఏపీలో ఎన్నికల అనంతరం బాగా ట్రెండింగ్ అయ్యింది. ఈ ట్యాగ్ లైన్ వాడుకుని జనసేన అభిమానులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో తిరుగులేని అధికారం ఉంది కదా? అని ఎక్కడపడితే అక్కడ హంగామా చేయాలని చూస్తున్నారు. అయితే కొందరు అత్యుత్సాహంతో తాము ఉన్న వేదిక, వేడుక ఏంటి అన్న విషయాన్ని గుర్తించకుండా అభాసుపాలవుతున్నారు. తాజాగా జనసేన జెండాతో ఓ అభిమాని హంగామా చేయడానికి ప్రయత్నిస్తే, తీరని అవమానం ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ప్రతిదానికి పార్టీ జెండాలను వాడితే రిజల్ట్ ఇలానే ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
విదేశాల్లో చదువుకుంటున్న కొందరు విద్యార్థులు.. అక్కడ తింగరి వేషాలు వేస్తూ అవమానాలు ఎదుర్కుంటున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల కష్టంతో చదువుకుని తమ డిగ్రీ పట్టాలు తీసుకునే సమయంలో నవ్వులపాలవడం వ్యక్తిగతంగా వారికే కాకుండా, దేశ ప్రతిష్ఠకు కూడా మచ్చ తెస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అలా వెళ్లి డిగ్రీలు పూర్తి చేసిన వారు తమ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లలో తమ రాజకీయ జెండాలను ఆవిష్కరిస్తున్నారు.
సహజంగా మన దేశంలో ఇలాంటి సంప్రదాయం కనిపించకపోయినా, విదేశాల్లో చదువుకుంటున్న వారు మాత్రం గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తమ అభిమాన పార్టీల జెండాలను ఆవిష్కరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీల జెండాలు ఇలా గ్రాడ్యుయేషన్ వేడుకల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ, బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం ఇప్పుడు ఆ వీడియోలను తమకు అనుకూలంగా ట్రెండింగ్ చేసుకుంటున్నాయి.
ఇటీవల ఓ విదేశీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా ఓ విద్యార్థి జనసేన జెండాను ఆవిష్కరించగా, అక్కడున్న ప్రొఫెషర్ అడ్డుకున్నాడు. జెండాను లాక్కున్నట్లు ఆన్లైన్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలు ఈ వీడియోను వైరల్ చేస్తూ విదేశాల్లో ఇవేం పిచ్చి చేష్ఠలు అంటూ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా మరో యూనివర్సిటీ టీడీపీ అభిమాని కూడా ఇలా జెండాను ఆవిష్కరించే ప్రయత్నం చేయగా, ప్రొఫెసర్ అభ్యంతరం వ్యక్తం చేసిన వీడియో కూడా ఒకటి చక్కర్లు కొడుతుంది. దీంతో జనసేన, టీడీపీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్, వైసీపీ జెండాలను పట్టుకుని కొందరు విద్యార్థులు తమ పట్టా తీసుకోవడాన్ని పాజిటివ్ గా చూపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇరుపార్టీల కార్యకర్తలు విమర్శలు, ప్రతి విమర్శలతో దుమ్ము రేపుతున్నారు.