ఏపీలో 43 లక్షల ఓట్లు ఔట్.. వైసీపీ సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.
By: Tupaki Political Desk | 22 July 2026 5:28 PM ISTరాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార కూటమి ప్రభుత్వం సర్ పై కుట్రలు చేస్తోందని, వైసీపీ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని పెద్దఎత్తున ఓట్ల తొలగిస్తోందని ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఈ మేరకు వైసీపీ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు పెట్టింది. ఓటు హక్కును కాలరాసేలా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని, బూత్ స్థాయి అధికారులను (బీఎల్వో) బెదిరించి ప్రతిపక్షానికి పట్టున్న జిల్లాల్లో ఉద్దేశపూర్వకంగానే ఓట్లను గల్లంతు చేస్తున్నారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో 16.38 శాతం ఓట్లు తొలగించారని ఎత్తిచూపింది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. నిజానికి 14వ తేదీనే సర్ సర్వే ముగియాల్సివుండగా, అధికార, విపక్షాల వినతి మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా పది రోజుల పాటు పొడిగించారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ ముగియనుండగా, సర్ లో అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. వైసీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గడువు ముగిసేనాటికి రాష్ట్రంలో మరిన్ని ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆ పార్టీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 43,62,387 ఓట్లు గల్లంతు అయినట్లు వైసీపీ ఆరోపించింది. మొత్తంగా 10.48 శాతం ఓటర్లను తొలగించడంపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఎక్కువ ఓట్లు గల్లంతు అయిన జిల్లాల్లో తిరుపతి జిల్లా ఏకంగా 16.38 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వైసీపీ వెల్లడించింది. ఈ జిల్లాలో తమ పార్టీకి ఎక్కువ బలం ఉండటంతోనే ఓట్లను భారీగా తొలగించారని ఆపార్టీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక రాష్ట్రంలోని మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో 14.87 లక్షల మంది చనిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించినట్లు చెబుతుండగా, మరో 13.68 లక్షల మంది శాశ్వత వలసదారుల పేరుతో ఓట్లను తొలగించారని లెక్కలు విడుదల చేసింది.
కాగా, కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతోనే భారీగా ఓట్లను తొలగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ప్రధానంగా గడువు పెంచిన తర్వాతే ఎక్కువగా ఓట్లను తొలగించారని ధ్వజమెత్తింది. తమ పార్టీకి పట్టున్న జిల్లాల్లో ఎక్కువ ఓట్లు డిలీట్ చేస్తున్నారని మండిపడింది. మొత్తానికి సర్ పై వైసీపీ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 45 రోజులుగా సర్ ప్రక్రియ కొనసాగుతోంది. అధికార కూటమి నేతలతోపాటు విపక్ష నేతలు తమ ఓటర్లను కాపాడుకోడానికి విశ్వప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. అయితే సరైన ఆధారాలు లేకపోవడం, ఓటర్ల ఆచూకీ లేకపోవడం వల్ల దాదాపు 44 లక్షల వరకు ఓట్లు తొలగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో డబుల్ ఎంట్రీలు, డెత్ ఓట్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
