ఏపీలో నేతలకు బ్రేకులు.. ఇక స్పెషల్ పాలన..!
ఐదేళ్ల కిందట 2021లో జరిగిన ఎన్నికల్లో దాదాపు ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. దీనిపై విమర్శలు ఉన్నాయి
By: Tupaki Desk | 18 March 2026 8:11 PM ISTరాష్ట్ర వ్యాప్తంగా తాడిపత్రి సహా.. 86 మునిసిపాలిటీలలో అధికారిక గడువు పూర్తయింది. ఐదేళ్ల కిందట 2021లో జరిగిన ఎన్నికల్లో దాదాపు ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. దీనిపై విమర్శలు ఉన్నాయి. ఏకపక్షంగా విజయం దక్కించుకున్నారని.. నామినేషన్లుకూడా వేయించలేదని.. పలువురు టీడీపీనాయకులు విమర్శించారు. అయితే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొన్ని కొన్ని మునిసిపాలిటీలను నాయకులు దక్కించుకున్నారు.
ఏదైతేనేం.. ఆయా మునిసిపాలిటీల్లో 5 సంవత్సరాల ప్రజాతీర్పు బుధవారంతో ముగిసింది. దీంతో నాయకులు మాజీ అయ్యారు. ఇక, ఇప్పుడు ఆయా 86 మునిసిపాలిటీలకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో ప్రభుత్వం ప్రత్యేక పాలనను అమల్లోకి తీసుకువచ్చింది. వీరు దాదాపు నాలుగు మాసాలు పాలనలో ఉంటారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించేందుకు కీలకమైన అంశాలు అడ్డంకిగా ఉన్నాయి. 1) ఓటర్ల జాబితాలు ప్రచురించలేదు. ఈ డేటా ప్రస్తుతం సేకరణ దశలోనే ఉంది. ఇది పూర్తయ్యేందుకు నాలుగు వారాల గడువు పడుతుంది.
అనంతరం.. ఆయా జాబితాలపై అభ్యంతరాలు తీసుకుంటారు. వాటిపైనా మార్పులు చేర్పులు జరగ నున్నాయి. ఈలోగా.. ప్రభుత్వం ఆయా మునిసిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంతేకాదు.. ప్రస్తుతం వివాదంగా ఉన్న కొన్ని కొన్ని మునిసిపాలిటీల్లో.. పనులు ముందుకు సాగలేదు. వీటిని కూడా సాధ్యమైనంత త్వరగానే పూర్తి చేయాలని నిర్దేశించుకున్నారు. ఇవి పూర్తయ్యాక.. సెప్టెంబరు-అక్టోబరు మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
నాయకులకు మంచిదే.. !
ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనపై నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు త్వరగా ఎన్నికలు పెట్టాలని కోరుతున్నారు. మరికొందరు ప్రత్యేక పాలన సమయం మంచిదేనని అంటున్నారు. వాస్తవానికిప్రత్యేక అధికారుల పాలనలో పనులు వేగంగా పూర్తవుతాయి. అంతేకాదు.. నాయకుల మధ్య వివాదాలు లేకుండా.. అందరూ కలిసి ప్రజల వద్దేందుకు భారీ సమయం ఉంటుంది. ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకునేందుకు కూడా ఇది చక్కని సమయమని మరికొందరు చెబుతున్నారు.
