లోకల్ ఫైట్ కు వారసులు రెడీ.. ఎక్కడి నుంచి ఎవరెవరు?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి సూచనలు చేసినట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 28 Aug 2026 8:08 AM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల సంఘానికి సూచనలు చేసినట్లు చెబుతున్నారు. అక్టోబరులో కొత్త ఓటర్ల జాబితా జారీ చేయనుండటంతో ఆ లోగానే మున్సిపాలిటీల నుంచి పంచాయతీల వరకు అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. దీంతో పార్టీలు, నాయకులు సైతం అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. స్థానిక సమరాన్ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించడంతో గెలుపు గుర్రాల వేట ముమ్మరమైందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎక్కువ మంది నేతలు తమ వారసులను బరిలోకి దించి రాజకీయాలకు రాచమార్గం వేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జడ్పీ చైర్మన్ పదవులకు వారసులను బరిలో దించాలని అధికార, ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరంతోపాటు అవసరమైతే డబ్బు ఖర్చు కూడా చేయాల్సిన పరిస్థితులు నెలకొనడంతో ఎక్కువ మంది నేతలు ఇతర అభ్యర్థులకు బదులుగా తమ కుటుంబ సభ్యులను పోటీకి పెట్టడమే బెటర్ అన్న ఆలోచనకు వస్తున్నట్లు చెబుతున్నారు. ఇటు శ్రీకాకుళం నుంచి అంటు అనంతపురం వరకు రెండు ప్రధాన పార్టీల నేతలు ఇదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బదులుగా వారసులను ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా పోటీ పెట్టాలని చాలా మంది నేతలు భావించారు. ఇటువంటి ఆలోచన చేసిన నేతలు టీడీపీతోపాటు వైసీపీలోనూ ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితుల వల్ల పార్టీలు వారసులకు అవకాశం ఇచ్చి సాహసం చేయాలని భావించలేదు. అలా అని అందరినీ పక్కన పెట్టలేదు. యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య, టీజీ వెంకటేశ్ కుమారుడు భరత్, పేరి నాని కుమారుడు కిట్టూ, చెవిరెడ్డి కుమారుడు మోహిత్ వంటివారు అసెంబ్లీకి ఆయా పార్టీల తరఫున పోటీ చేశారు. ఇదే సమయంలో వైసీపీలోని ధర్మాన బ్రదర్స్, బొత్స వంటి సీనియర్ నేతల పిల్లలకు అవకాశం దక్కలేదు. అదేసమయంలో టీడీపీలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళావెంకటరావు, బండారు సత్యనారాయణమూర్తి, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు వారసులకు అవకాశం ఇప్పించాలని ప్రయత్నించినా సఫలం కాలేకపోయారని అంటున్నారు.
ఇటువంటి నేతలు ఇప్పుడు లోకల్ ఎన్నికలను మరో అవకాశంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ హోదాకు ఏ మాత్రం తీసిపోని, కేబినెట్ మంత్రి హోదా ఉండే మేయర్లు, జడ్పీ చైర్మన్ పదవులకు వారసులను పోటీకి పెట్టాలని చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలను ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని భావించడంతో తమ పిల్లల రాజకీయ ప్రవేశానికి మంచి వేదిక లభించినట్లు అవుతుందని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ సీనియర్ బొత్స ఈ విషయంలో ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారని పరిశీలకులు భావిస్తున్నారు. తన కుమార్తె అనూషను విజయనగరం జడ్పీ అభ్యర్థిగా బొత్స ప్రకటించారు. దీంతో చాలా మంది నేతలు బొత్స మార్గంలో అడుగులు వేయాలని సన్నిహితుల అభిప్రాయాలను సేకరిస్తున్నారని అంటున్నారు.
