సిట్ డైరెక్షన్.. విజయసాయి యాక్షన్, వైసీపీకి టెన్షన్!
లిక్కర్ స్కాంలో విచారణకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన విచారణకు వస్తారా? రారా?
By: Tupaki Desk | 18 April 2025 12:01 PMఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నేతలు మద్యం కుంభకోణంలో పాత్రధారులు అంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేల్చిన బాంబుతో వైసీపీ నేతలు టెన్షన్ పెడుతున్నారు. శుక్రవారం సెట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి వాంగ్మూలం కేసు విచారణలో కీలకంగా మారుతుందని భావిస్తున్నారు. దీంతో ఆయన ఏం చెబుతున్నారు? సిట్ యాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నదానిపై ప్రతిపక్షం ఆందోళనకు గురవుతోందని అంటున్నారు.
లిక్కర్ స్కాంలో విచారణకు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన విచారణకు వస్తారా? రారా? అన్న ఊగిసలాట కొనసాగింది. అయితే సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చిన విజయసాయిరెడ్డి నేరుగా సీపీ రాజశేఖరబాబును కలిశారు. లిక్కర్ స్కాంలో కీలక సాక్షిగా పరిగణిస్తున్న విజయసాయిని రెండు గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాను గతంలో బయటపెట్టిన రాజ్ కసిరెడ్డి పాత్రపై విజయసాయిరెడ్డి మరన్ని ఆధారాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి శుక్రవారం ఉదయమే విజయసాయిరెడ్డి విచారణకు రావాల్సివుంది. అయితే సిట్ అధికారుల సూచనలతోనే ఆయన మధ్యాహ్నం వచ్చారంటున్నారు. ఉదయం నుంచి విజయవాడలోనే ఉన్న విజయసాయిరెడ్డి సిట్ పిలుపు కోసం ఎదురుచూసి మధ్యాహ్నం కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం మరో ఇద్దరిని విచారిస్తున్నందున విజయసాయిరెడ్డిని మధ్యాహ్నం రమ్మని సిట్ పోలీసులు చెప్పినట్లు తెలుస్తోంది. విచారణకు పూర్తిగా సహకరించేలా సిట్ డైరెక్షన్ లోనే విజయసాయిరెడ్డి నడుచుకుంటున్నారని అంటున్నారు. ఈ పరిణామం వైసీపీ నేతలను టెన్షన్ పెడుతోందని అంటున్నారు.
వాస్తవానికి వైసీపీ కీలక నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డితో కలిసి విజయసాయిరెడ్డిని విచారించాలని తొలుత సిట్ భావించినట్లు చెబుతున్నారు. సాక్షిగా విజయసాయిరెడ్డి ఇచ్చే వాంగ్మూలంపై ఆ ఇద్దరు ఏం చెబుతురానేది సిట్ తెలుసుకోవాలని అనుకుందని అంటున్నారు. ఐతే తన విచారణ విషయమై మిథున్ రెడ్డి కోర్టు ద్వారా డైరెక్షన్ పొందడం, కసిరెడ్డి పరారీలో ఉండటంతో సిట్ అధికారులు వ్యూహం మార్చారని చెబుతున్నారు. మరోవైపు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి, ఆయన సహాయకుడు తండ్రిని పోలీసులు రెండు రోజులుగా విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో వారిచ్చే సమాచారం కూడా కీలకంగా చెబుతున్నారు. మొత్తానికి సిట్ విచారణ వేగవంతం కావడంతో అరెస్టులపై ఆందోళన వ్యక్తమవుతోంది.