Begin typing your search above and press return to search.

లిక్కర్ స్కాంలో వాట్ నెక్ట్స్.. ఆచూకీ లేని రాజ్ కసిరెడ్డి!

ఏపీ లిక్కర్ స్కాంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పోలీసులకు సవాల్ గా మారింది. స్కాంలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి పరార్ తో పోలీసులు ముందడుగు వేయలేకపోతున్నారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 April 2025 8:13 AM
లిక్కర్ స్కాంలో వాట్ నెక్ట్స్.. ఆచూకీ లేని రాజ్ కసిరెడ్డి!
X

ఏపీ లిక్కర్ స్కాంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం పోలీసులకు సవాల్ గా మారింది. స్కాంలో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న వైసీపీ నేత రాజ్ కసిరెడ్డి పరార్ తో పోలీసులు ముందడుగు వేయలేకపోతున్నారని అంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతో మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డికి ప్రత్యేక పోలీసు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. సిట్ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన రాజ్ కసిరెడ్డి.. హైకోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ విచారణకు ముఖం చాటేశారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితిని ముందే ఊహించిన కసిరెడ్డి రాజ్ రెడ్డి అండర్ గ్రౌండుకు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.

స్కాంలో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి పత్తా లేకపోవడంతో సిట్ అధికారులు సవాల్ గా తీసుకున్నారని అంటున్నారు. ఆయన కాంట్రాక్టులపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వంలో పోలీసుశాఖలో కీలక బాధ్యతలు చూసిన ఓ ఐపీఎస్ అధికారి సలహాలు సూచనలతో సిట్ కు అందుబాటులో లేకుండా, ఎలాంటి ఆధారాలు వదలకుండా రాజ్ కసిరెడ్డి తప్పించుకుంటున్నారని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఆ పోలీసు అధికారి వైసీపీలో బడా నేతలను రక్షించేందుకు రంగంలోకి దిగారని అంటున్నారు. దీంతో ఆ పోలీసు అధికారి కదలికలు, ఆయన ఫోన్, ఇతర సాంకేతిక అంశాలపైనా పోలీసులు ఫోకస్ చేశారంటున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి లిక్కర్ స్కాంను బయటపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకుని, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసినా, ఇంతవరకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న విషయంపై ఓ అంచనా చిక్కడం లేదంటున్నారు. అందుకే ఈ స్కాంలో అరెస్టుల ప్రక్రియ ఆలస్యమవుతోందని అంటున్నారు. ప్రస్తుతానికి అందరినీ అనుమానితులుగానే భావిస్తున్నారని, నిందితులుగా గుర్తించేందుకు అవసరమైన ప్రక్రియనే కొలిక్కి రావడం లేదని అంటున్నారు. రాజ్ కసిరెడ్డి విచారణకు వస్తేనే ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుందని సిట్ అధికారులు భావించారని అంటున్నారు. అయితే ఆయన పరారీతో ఇప్పుడు ఎలా ముందడుగు వేయాలనేది సిట్ అధికారులు ఆలోచిస్తున్నారు. రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేయడం ఒక్కటే వారి ముందున్న మార్గంగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన రాజ్ కసిరెడ్డి.. దేశం దాటిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులు జారీ కాకముందే ఆయన దేశం దాటి వెళ్లితే అప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ కూడా నడుస్తోంది. ఏదిఏమైనా రాజ్ కసిరెడ్డి దొరికితేనే లిక్కర్ స్కాం గుట్టు వీడే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.