మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందా? విజయసాయిని కూడా లోపలేస్తారా?
ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యూచర్ పై ఇంట్రస్టింగ్ డిబేట్ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్నారు.
By: Tupaki Desk | 23 April 2025 11:17 AMఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యూచర్ పై ఇంట్రస్టింగ్ డిబేట్ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరూ ప్రస్తుతం ఉప్పు-నిప్పులా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగా ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు చేయకపోయినా, మద్యం స్కాంలో దొరికిన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తానని సాయిరెడ్డి చేసిన హెచ్చరికతో మిథున్ రెడ్డి మరిన్ని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుల్లో మిథున్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. అదే సమయంలో నిన్నమొన్నటి వరకు విజయసాయి వైసీపీలో నెంబర్ 2గా కొనసాగారు. అధినేతతో గ్యాప్ రావడం వల్ల తాను రెండు నుంచి రెండు వేల స్థానానికి పడిపోయానని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పడం చూస్తే వైసీపీలో ఆయన స్థానానికి ఎంతటి ప్రాధాన్యం ఉండేదో అర్థమవుతోందని అంటున్నారు. అయితే లిక్కర్ స్కాంలో ఈ ఇద్దరూ ఇరుక్కోవడం చర్చనీయాంశమవుతోంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మద్యం విధానంలో మార్పు తీసుకువచ్చారు. అప్పటివరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పాలసీని విజయసాయిరెడ్డి ఇంట్లో రూపొందించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని సాయిరెడ్డి కూడా అంగీకరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తన ఇంట్లో రెండు సమావేశాలు నిర్వహించి మద్యం విధానంపై చర్చించామని మీడియాలో అంగీకరించారు. అదే సమయంలో తనకు స్కాంతో సంబంధం లేదని, ఒక్క రూపాయి కూడా ముట్టలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రత్యేక దర్యాప్తు అధికారులు విచారించారు. విజయసాయిరెడ్డి తర్వాత ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ అనంతరం ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిని కూడా అరెస్టుచేసే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ4 మిథున్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై ఓ సారి విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణ జరిపిన వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు ఇప్పట్లో అరెస్టు చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు. సుప్రీం గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే మిథున్ రెడ్డి విషయంలో నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. ఇదే సమయంలో మిథున్ రెడ్డి విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందని చెబుతున్నారు. రాయలసీమలో రాజకీయంగా కీలక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో పరస్పర ప్రయోజనాలు కోణంలో మిథున్ రెడ్డి విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు విజయసాయిరెడ్డిని పోలీసులు ఏ5గా పేర్కొన్నారు. ఏ2, ఏ3గా ప్రభుత్వ ఉద్యోగులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ను పేర్కొన్నారు. ఏ1ను ఇప్పటికే అరెస్టు చేసినందున వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ను ఏ క్షణమైనా అరెస్టు చేస్తారంటున్నారు. ఇక మిథున్ రెడ్డికి ప్రస్తుతం కోర్టు రక్షణ ఉన్నందున వరుస క్రమంలో విజయసాయిరెడ్డి పేరును పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. స్కాం దర్యాప్తునకు తాను స్వచ్ఛందంగా సహకరిస్తానని విజయసాయిరెడ్డి చెబుతుండటం వల్ల ఆయనను అరెస్టు చేయాలా? లేదా అప్రూవర్ గా చూపి సాక్షిగా మార్చేయాలా? అన్నదానిపై సిట్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారని చెబుతున్నారు. దీంతో స్కాంపై విచారణ జరుపుతున్న సిట్ అధికారుల నెక్ట్స్ యాక్షన్ ఎలా ఉంటుందన్న టెన్షన్ కనిపిస్తోంది.