17 నుంచి ఏపీ అసెంబ్లీ.. వైసీపీ సెంట్రిక్గా వ్యూహ రచన
మరోవైపు కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులపై వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు .
By: Garuda Media | 6 Aug 2026 9:57 AM ISTఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఈ నెల 17 నుంచి జరపాలని సభానాయకుడి హోదాలో సీఎం చంద్రబాబు తాజా నిర్ణయిం చారు. దీనిపై గురువారం(ఆగస్టు 6) జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మరింత చర్చించనున్నారు. 17 నుంచి నాలుగు రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని సీఎం ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే.. దీనిని సభ్యులతో కూడా చర్చించి.. అవసరం అయితే మరో మూడు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉంటుంది. ఇక, తాజాసమావేశాల్లో వైసీపీ సెంట్రిక్గానే చర్చలు ఉండాలని సీఎం తేల్చి చెప్పారు.
రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలన, ఐదేళ్ల వైసీపీ పాలనపై సభలో చర్చించాలని మంత్రులకు నిర్దేశించారు. అంతేకాదు.. ఎమ్మెల్యేలు కూడా దీనిపై పట్టు పెంచుకుని సభకురావాలని సూచించారు. ``మీకు సందేహాలు ఉంటే.. నన్ను అడగండి. మీరు ఎమ్మెల్యేలకు చెప్పండి. అందరూ సబ్జెక్టుపై పట్టు పెంచుకోండి. వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం ఎలా విధ్వంసమైందన్న విషయాన్ని మనం చెబుతున్నాం. ఈ సారి అలా కాదు.. నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాల వారీగా జరిగిన విధ్వంసాన్ని సభ సాక్షిగా ప్రజలకు వివరించాలి. అదేసమయంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ఎలా చక్కదిద్దుతున్నామో కూడా వివరించాలి`` అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
పెట్టుబడులపై కూడా..
మరోవైపు కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులపై వైసీపీ నాయకులు విషప్రచారం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు . కేవలం అమరావతి, విశాఖపట్నంలోనే అన్ని పెట్టుబడులు పెడుతున్నారని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తద్వారా ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆయన అన్నారు. ఆయా విషయాలను కూడా సభ ద్వారా ప్రజలకు వివరించాలనిమంత్రులు సూచించారు. ``శాఖల పరంగా ఎవరెవరికి ఎంత మేలు జరిగింది? ఏయే జిల్లాల్లో పెట్టుబడు లు వచ్చాయి. అన్ని వివరాలపైనా మంత్రులకు అవగాహన ఉండాలి. మీమీ శాఖల కార్యదర్శులతో చర్చించి ఆయా వివరాల ను సేకరించి.. సభలో వివరించండి.`` అని మంత్రులకు సూచించారు.
మండలిలో హాట్..
ఈ సారి మండలిలో కూడా చర్చలు జరగాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. వైసీపీ బలం ఎక్కువగా ఉందని.. బుల్డోజ్ చేస్తోంద ని.. ఈ సారి అలా జరిగేందుకు అవకాశం ఇవ్వకుండా చూడాలని అన్నారు. అదేసమయంలో మండలి ఉప చైర్మన్ ఎంపిక విషయంలో టీడీపీకూడాపోటీ చేసేందుకు అవకాశం దక్కించుకోవాలని అన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్సీలు.. ఆ పార్టీ వైఖరిపై నిరసనతో ఉన్నారని..వారు కూటమి తరఫున అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మండలిలో ఉప చైర్మన్ను ఎంపిక చేసేందుకు ఏకపక్షంగా కాకుండా.. ఓటింగ్ జరిగేందుకు అవకాశం కలిగేలా ముందుగానే చైర్మన్కు సమాచారం ఇవ్వాలన్నారు.
కాగా.. నిన్నటి వరకు మండలి ఉప చైర్మన్గా ఉన్న జకియా ఖానుం పదవీకాలం ముగియడంతో కొత్తగా ఉప చైర్మన్ను ఎంపిక చేయాల్సి ఉంది. వైసీపీ ఇప్పటికే మాధవరావును(ప్రకాశం జిల్లా)ఈ పదవికి ఎంపిక చేసింది. అయితే.. ఏకపక్షంగా కాకుండా.. ఎన్నిక నిర్వహించేలా చూడాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. తద్వారా వైసీపీలో ఉండి.. ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న వారు క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
