Begin typing your search above and press return to search.

ఆ ఎదురింటోడు చచ్చిపోయాడు? జిల్లా ఎస్పీ ఏం చెప్పారు?

ఏడేళ్ల చిన్నారిని అమానుషంగా చిదిమేసిన ఎదురింటి కిరాతకుడు చెరువులో శవమయ్యాడు.

By:  Garuda Media   |   18 Feb 2026 5:39 PM IST
ఆ ఎదురింటోడు చచ్చిపోయాడు? జిల్లా ఎస్పీ ఏం చెప్పారు?
X

ఏడేళ్ల చిన్నారిని అమానుషంగా చిదిమేసిన ఎదురింటి కిరాతకుడు చెరువులో శవమయ్యాడు. అన్నమయ్య జిల్లాలో కరసానివారిపల్లి చెరువులో అతడి డెడ బాడీ దొరికింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ముదివేలు పోలీసులు.. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా కేంద్ర మదనపల్లెలో కనిపించకుండా పోయిన ఏడేళ్ల చిన్నారిని కనిపించకుండా పోవటం.. తీరా చూస్తే ఎదురింటి కులవర్ధన్ ఇంట్లోని నీళ్ల డ్రమ్ములో నిర్జీవంగా పడి ఉన్న వైనాన్ని చూసిన పోలీసులు, స్థానికులు షాక్ తిన్నారు. అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన వైనం పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.

దీంతో అతడ్ని కఠినంగా శిక్షించాలన్న ఆందోళన పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. కులవర్ధన్ చెరువులో చనిపోయిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. అతడ్ని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత చెరువులో అతడి డెడ్ బాడీని గుర్తించిన వైనంపై జిల్లా ఎస్పీ ధీరజ్ మీడియాతో మాట్లాడారు. కులవర్ధన్ ఆత్మహత్య వైనం గురించి వివరించారు.

చిన్నారిని హత్యాచారం చేసిన ఉదంతంలో నిందితుడ్ని అదుపులోకి తీసుకొన అతడ్ని పోలీసు స్టేషన్ కు తరలిస్తుండగా.. రక్షక్ వాహనం నుంచి తప్పించుకున్నట్లుగా జిల్లా ఎస్పీ ప్రకటించారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక టీంలు గాలిస్తుండగా.. అతను చెరువులో చనిపోయిన వైనాన్ని గుర్తించారు. ఆత్మహత్య చేసుకొన్నట్లుగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిని హత్యాచారం చేసినోడు ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. తగినశాస్తి జరిగిందన్న మాట వినిపిస్తోంది.

కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసినంతనే గ్రామస్తులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కులవర్ధన్ పాపం పండిందని పేర్కొంటున్నారు. నిందితుడ్ని చూసి భయపడేవాళ్లమని.. అతడికి సరైన శిక్ష పడినట్లుగా పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మదనపల్లెలో చిన్నారిపై ఘాతుకాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లుగా రాష్ట్ర హోం మంత్రి అనిత్ పేర్కొన్నారు. గంజాయికి బానిసగా మారిన ఇతను పలు అరాచకాలకు పాల్పడినట్లుగా స్థానికులు చెబుతున్నారు.