మొన్న బిడ్డ కోసం.. నేడు భర్త కోసం.. పవన్ సతీమణి ఏం చేశారంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి.. అన్నా లెజినోవా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ దర్శనమే అయితే ఇది పెద్దగా చర్చకు రాకపోయేది.
By: Garuda Media | 18 July 2026 3:00 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి.. అన్నా లెజినోవా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణ దర్శనమే అయితే ఇది పెద్దగా చర్చకు రాకపోయేది. కేవలం పవన్ కల్యాణ్ అభిమానులకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ, ఆమె కీలక సమయంలో తిరుమలకు రావడం, మెట్ల మార్గంలో కొండకు చేరుకోవడం.. శ్రీవారికి మొక్కులు సమర్పించడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో పవన్ కల్యాణ్ కు తన ఫ్యామిలీకి అన్నా ఇస్తున్న ప్రాధాన్యం ఆసక్తిగా మారింది.
కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్కల్యాణ్.. ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసంలో రెస్టు తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడాలని, కుడి భుజానికి జరిగిన ఆపరేషన్ తాలూకు గాయం త్వరగా మానాలని వేడుకుంటూ.. అన్నా తిరుమలకు వచ్చారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆమె.. మెట్ల మార్గంలో కొండకు చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అయితే.. అన్నా పర్యటన విషయాన్ని పార్టీ చాలా గోప్యంగా ఉంచింది. ఎక్కడా మీడియాకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంది. అయితే.. ఆమె మెట్లు ఎక్కుతున్న సమయంలో గుర్తించిన కొందరు భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. ఆ తర్వాత.. ప్రధాన మీడియా గుర్తించింది. పవన్ కల్యాణ్ ఆరోగ్యం మెరుగు పడాలని, ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకుంటున్నట్టు అన్నా తెలిపారు. అన్నా ప్రయత్నాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఫ్యామిలీకి ఆమె ఇస్తున్న ప్రాధాన్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇదిలావుంటే.. గతంలో కుమారుడు మార్క్ శంకర్.. మాల్దీవుల్లోని పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. కుమారుడి కోసం కూడా నాడు శ్రీవారికి మొక్కుకున్న అన్నా.. ఏకంగా అప్పట్లో తలనీలాలు సమర్పించి తన భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత.. ఇప్పుడు భర్త కోసం.. తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని.. తన భక్తి విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు.
