Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన అయ్య‌న్న పాత్రుడు..!

``వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారా`` అన్న ప్రశ్నకు స్పీకర్ అయ్యన్నపాత్రుడే స్వయంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది.

By:  Garuda Media   |   20 Sept 2025 11:00 PM IST
జ‌గ‌న్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన అయ్య‌న్న పాత్రుడు..!
X

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదన్న విషయం తెలిసిందే. ఎవ‌రు ఎన్ని చెప్పినా.. ఎంత మంది సూచ‌న‌లు చేసినా.. ఎంత మంది విమ‌ర్శ‌లు గుప్పించినా.. ఆయ‌న మాత్రం త‌న ప‌ట్టుద‌ల‌ను విడిచి పెట్ట డం లేదు. అయితే, ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌పై మ‌రో విమ‌ర్శ కూడా వినిపిస్తోంది. `జ‌గ‌న్‌.. అసెంబ్లీకి రాకుండా వేత నాలు తీసుకుంటున్నారు` అనే వాదన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సభకు రాకుండా జీతాలు తీసుకోవ డం ఎందుకు? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇది కూడా నిజ‌మేక‌దా? స‌భ‌కు రాన‌ప్పుడు వేత‌నం ఎందుకు తీసుకోవాల‌న్న‌ది కూడా లాజిక్కే..!.

ఇక‌, ఇటీవల తిరుపతిలో జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ మహిళా ప్రజా ప్రతినిధుల జాతీయ సదస్సులో ఈ విషయాన్ని స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. సభకు రాకుండా జీతాలు తీసుకోవడం అనేది సరికాదని, చిన్నపాటి ఉద్యోగం చేసుకునే వారే ఆబ్సెంట్ అయితే జీతం కట్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. కాబ‌ట్టి సభకు రాకుండా జీతం తీసుకోవడం అనేదాన్ని అయ్యన్నపాత్రుడు ఖండించారు. దీంతో వైసిపి ఎమ్మెల్యే లు సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారా అనే విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

దీనిపై తాజాగా టిడిపికే చెందిన ఓ ఎమ్మెల్యే ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. ``వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారా`` అన్న ప్రశ్నకు స్పీకర్ అయ్యన్నపాత్రుడే స్వయంగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. దీనిలో ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ.. ``జగన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ జీతాలు తీసుకుంటున్నారు`` అని చెప్పారు. అంటే సభకు రానివాళ్ళల్లో ఒక జగన్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ వేతనాలు తీసుకుంటున్నారు అనే విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియకపోవడం చిత్రంగా ఉంది.

మరి ఈ విషయాన్ని తెలిసి అయ్యన్నపాత్రుడే స్వయంగా తిరుపతి సదస్సులో ప్రస్తావించరా.. లేక తెలియక ప్రస్తావించారా ..అనేది పక్కన పెడితే మొత్తానికి జగన్ విషయంలో మాత్రం ఆయన జీతం తీసుకోవడం లేదు అని స్పష్టం చేయడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు జగన్ పై సభకు రాకుండా జీతం తీసుకుంటున్నారు అని చేసిన విమర్శలు.. దాదాపు ఇక తెరమరుగు అవుతాయి. ఇదే సమయంలో సభకు రాకపోతే సస్పెండ్ అవుతారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. చిత్రం ఏంటంటే.. స‌భ‌కు రాకుండా వేత‌నం తీసుకునే వారిలో టీడీపీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.