దేశంలో తొలిసారి.. మరో రికార్డు దిశగా చంద్రబాబు అడుగులు
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి వేగవంతం అవడంతోపా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 4 Jun 2025 10:15 PM ISTకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏడాది పాలనలో అనేక విప్లవాత్మక మార్పులు, పరిపాలన సంస్కరణలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని సీఎం వెల్లడించారు. దీనిద్వారా రాష్ట్రంలో జల, వాయు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసి మెరుగైన రవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఏర్పాటు చేస్తున్న లాజిస్టిక్స్ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి వేగవంతం అవడంతోపా ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తొలి దశలో అమరావతి, శ్రీకాకుళం, కుప్పం, దుగదర్తి ఎయిర్పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని లాజిస్టిక్స్ కార్పొరేషన్ కు సూచించారు వచ్చే ఏడాది 4 పోర్టులు, 4 హార్బర్లు పూర్తి చేయనున్నామని సీఎం వివరించారు. ఇక, ప్రభుత్వ-ప్రైవేటు-పబ్లిక్(పీపీపీ) భాగస్వామ్యంతో స్టేట్ లెవిల్ రోడ్లను జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రాజెక్టులను కూడా ఈ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుందని సీఎం చెప్పారు. దాదాపు అన్ని స్టేట్ లెవిల్ రోడ్లను కూడా నేషనల్ రోడ్లతో లింకు చేయాలని సూచించారు.
ప్రజలు తమ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్న చంద్రబాబు.. ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన సాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా తప్లు చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే క్షమించేది లేదని తేల్చిచెప్పారు. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా ప్రభుత్వం పాలన అందిస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సమయంలో.. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని, పనులను మరింత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
